Tollywood: టాలీవుడ్‌ కొత్త కబుర్లేంటో తెలుసా?

Tollywood: థ్యాంక్యూ కలెక్టర్‌ అంటున్న సాయితేజ్‌, విశాల్‌ కొత్త చిత్రం కబుర్లు, ఆది సాయికుమార్‌ న్యూ మూవీ పోస్టర్‌ సంగతులు

Updated : 16 Nov 2023 14:51 IST

థ్యాంక్యూ కలెక్టర్‌ అంటున్న సాయితేజ్‌

సాయితేజ్‌ కథానాయకుడిగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘రిపబ్లిక్‌’. ఇందులో సాయితేజ్‌ కలెక్టర్‌ పంజా అభిరామ్‌గా నటించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘థ్యాంక్యూ కలెక్టర్‌’ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. ‘సరిహద్దుల్లో నిలబడి, విదేశీ శత్రువుల నుంచి మన దేశాన్ని కాపాడే సైనికుడంటే, మనకు ఎంతో గౌరవం. వారి వీరిగాథలు ఎన్నో విన్నాం. చూశాం. కానీ, దేశ సరిహద్దుల్లోపల స్వదేశీ శత్రువులు మన వ్యవస్థపై చేసే అన్యాయాల నుంచి రోజూ కలెక్టర్లు పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటంలో జయించిన వారూ ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్లూ ఉన్నారు. వాళ్ల గురించి మనలో ఎంతమంది తెలుసు? అలాంటి ధైర్యవంతులైన కలెక్టర్లను గుర్తించి, ‘థ్యాంక్యూ కలెక్టర్‌’ పేరుతో వారి గాథలను మీ ముందుకు తీసుకొస్తాం’ అని సాయితేజ్‌ చెప్పుకొచ్చారు.

 

విశాల్‌ కొత్త చిత్రం షురూ

విశాల్‌ కథానాయకుడిగా ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం ప్రారంభమైంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. తాజాగా విశాల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని చెన్నైలోని ప్రసిద్ధ సాయిబాబా దేవాల‌యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రానా ప్రొడక్షన్స్‌ ప‌తాకంపై ర‌మ‌ణ‌, నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునైన‌ కీలక పాత్ర పోషిస్తోంది. సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడాన్ని ప్రభావితం చేసే అంశం నేపథ్యంగా తెరకెక్కే ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ ఒకే టైటిల్ ఉండ‌నుంది. పోరాట సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. శ్యామ్‌ సీఎస్ సంగీతం ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


‘అతిథిదేవోభవ’ అంటున్న ఆది సాయికుమార్‌

ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అతిథిదేవోభవ’. నువేక్ష కథానాయిక. పొలిమెర నాగేశ్వర్‌ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న  ఈ సినిమాకు సంబంధించి బుధవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. లవ్‌ అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘అతిథిదేవోభవ’ రానుంది. శ్రీనివాస  సినీ క్రియేషన్స్‌ పతాకంపై రాజాబాబు, మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని