రాగిణి, సంజనా.. అన్ని ఆస్తులు ఎక్కడివి?

మాదకద్రవ్యాల కేసు తిరగరాని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టైన సినీతారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ విచారణ సందర్భంగా చెబుతున్న అంశాలు.. కొత్తపేర్లను తెరపైకి తెస్తునాయి. ...

Updated : 12 Sep 2020 10:22 IST

బెంగళూరు (యశ్వంతపుర) : మాదకద్రవ్యాల కేసు తిరగరాని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టైన సినీతారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ విచారణ సందర్భంగా చెబుతున్న అంశాలు.. కొత్తపేర్లను తెరపైకి తెస్తునాయి. ఈ వ్యవహారాలతో మరికొందరు సినీ నటులు, సంగీతకళాకారులకు సంబంధాలున్నాయని ఆ ఇద్దరూ గుట్టు రట్టు చేసినట్లు సమాచారం బయటకు పొక్కింది. ఇద్దరు ప్రముఖ నటీమణులూ ఆ జాబితాలో ఉన్నారనేది మరో సమాచారం. పలువురు రాజకీయ నాయకులు, వారి కుమారులు, శ్రీమంతుల బిడ్డల పేర్లు.. ఇలా జాబితా పెరుగుతోంది. వాస్తవం ఎంతో తెలియని నేపథ్యంలో వదంతులు షికారు చేస్తున్నాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆ ప్రముఖులంతా ముందస్తు జామీను కోసం ప్రయత్నాల్లో పడ్డారు. సినీ నటులు, సంగీత కళాకారులు ముందస్తు జామీను కోసం తమ న్యాయవాదుల్ని సంప్రదిస్తున్నారు. నటీమణులు చెప్పిన పేర్లన్నీ ప్రముఖులవేనని, వారికి కేసులో సంబంధం ఉన్నదీ- లేనిదీ తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

నటీమణులు మత్తుపదార్థాలు తీసుకుంటున్నారా? లేదా? అనే విషయాన్ని శాస్త్రీయంగా గుర్తించడానికి ఆ ఇద్దరి నుంచి రక్తం, తలవెంట్రుకలను సేకరించిన వైద్యులు మడివాళలోని ప్రయోగశాలకు పంపించారు. కనీసం 92 రోజుల కిందట డ్రగ్స్‌ వాడినా ఈ పరీక్షల్లో తేలిపోతుందట. ఈ పరీక్షలకు సంజనా, రాగిణి ససేమిరా అన్నారు. వైద్య సిబ్బందితో తీవ్రస్థాయిలో గొడవపడ్డారని సమాచారం.

 మరోవైపు.. ఆ ఇద్దరి ఆస్తులపై సీసీబీ అధికారులు దృష్టి సారించారు. నాకు నగరంలో పది ప్లాట్స్‌ ఉన్నట్లు సంజనా చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోయారట. తక్కువ సినిమాల్లో నటించి అంత ఆస్తి ఎలా సంపాదించారో తెలియని అంశం. మాదక ద్రవ్యాల సరఫరా ద్వారా వచ్చిన నగదు హవాలా రూపంలో తరలించారన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.

రాగిణి, సంజనా గల్రానీలను శుక్రవారం సీసీబీ సంయుక్త కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ ప్రత్యేకంగా విచారించారు. మందు పార్టీలు, శ్రీలంక పర్యటనలు, మత్తుపదార్థాల వాడకంపై ఆయన ఎడతెరిపి లేకుండా ప్రశ్నలు సంధించారు. కొన్ని ప్రశ్నలకు ఆ ఇద్దరూ బదులివ్వలేదని సీసీబీ వర్గాలు వెల్లడించాయి. ‘మాకేం తెలీదు. అనవసరంగా ఇరికించారు’ అంటూ వాపోతున్నట్లు ఓ అధికారి చెప్పారు. ఇదే కేసులో కీలక నిందితుడు, మంగళూరుకు చెందిన ప్రతీక్‌శెట్టిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు షేక్‌ ఫైజల్‌, ఆదిత్య ఆళ్వ ఆచూకీ తెలియలేదు.

సంబరగిపైనా కేసు

మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాలతో సంబంధం ఉందని ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన న్యాయవాది ప్రశాంత్‌ సంబరగి విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చినట్లు పోలీస్‌ శాఖ సంయుక్త కమిషనర్‌ సందీప్‌పాటిల్‌ తెలిపారు. సీసీబీ అధికారుల ఎదుట శనివారం హాజరు కావాలని నోటీసు జారీ చేశారు. మరోవైపు చామరాజపేట శాసనసభ్యుడు జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ ఫిర్యాదు ఆధారంగా చామరాజపేట పోలీసులు సంబరగిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. జమీర్‌ పరువు నష్టం దావా వేయడమేగాక.. సంబరగి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

కస్టడీలోనే రాగిణి

బెంగళూరు (శివాజీనగర) : మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలకు సంబంధించి అరెస్టయిన నటీమణి రాగిణి ద్వివేది జామీను కోసం దాఖలు చేసిన విచారణను ఏసీఎంఎం న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. జామీను కోసం ముంబయికి చెందిన న్యాయవాదులను రాగిణి తల్లిదండ్రులు నియమించారు. గతంలో ఒకసారి దాఖలుచేసిన అర్జీని 33వ సీసీిహెచ్‌ న్యాయస్థానం తోసిపుచ్చింది.

మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన కథానాయికలు రాగిణి, సంజనలను వీడియో కాన్ఫరెన్సు ద్వారా వసంతనగర సమీపంలోని ప్రత్యేక న్యాయస్థానం ముందు పోలీసులు హాజరు పరిచారు. ఇప్పటి వరకు నిర్వహించిన విచారణకు వీరిద్దరూ సహకరించలేదని, మరో వారం పాటు వారిద్దరినీ తమ కస్టడీకి అప్పగించాలని దర్యాప్తు అధికారులు కోరారు. వారికీ- మాదక ద్రవ్యాలకూ సంబంధం ఉందని పలు ఆధారాలు ఇప్పటికే స్వాధీనపరుచుకున్నామని, వాటి గురించి అడిగిన ప్రశ్రలకూ వారు బదులివ్వడం లేదని పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి సోమవారం వరకు వారిద్దరినీ సీసీబీ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాగిణి కస్టడీ శుక్రవారం సాయంత్రానికి ముగియగా, సంజన కస్టడీ శనివారం సాయంత్రానికి ముగియనుంది. రెండో శనివారం న్యాయస్థానాలకు సెలవు ఉన్న నేపథ్యంలో ఆమెనూ న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.

మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన ప్రశాంత్‌ రాంకా, లూమ్‌, రవిశంకర్‌, రాగిణి, రాహుల్‌, నియాజ్‌ల పోలీసు కస్టడీని సోమవారం వరకు ఒకటో ఏసీఎంఎం న్యాయస్థానం పొడిగించింది. నిందితులను వీడియో కాన్ఫరెన్సు విధానంలో న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వీరెవరూ జామీను కోసం ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేదు. విచారణ కొనసాగించవలసిన నేపథ్యంలో కస్టడీని పొడిగించాలని పోలీసుల తరుఫు న్యాయవాది విన్నపాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని