అధీర పాత్రకు గంటన్నర మేకప్‌: సంజయ్‌ దత్‌

తన కెరీర్‌లో చాలా రోజుల తర్వాత ఒక భిన్నమైన పాత్ర పోషిస్తున్నానని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ అన్నారు. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కేజీయఫ్‌ 2’. శ్రీనిధి....

Updated : 08 Jan 2021 10:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన కెరీర్‌లో చాలా రోజుల తర్వాత ఒక భిన్నమైన పాత్ర పోషిస్తున్నానని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ అన్నారు. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కేజీయఫ్‌ 2’. శ్రీనిధి శెట్టి కథానాయిక. రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను నటుడు సంజయ్‌దత్‌ అభిమానులతో పంచుకున్నారు.

ప్రశాంత్‌ను చూసి ఎన్నో నేర్చుకున్నా!

‘‘ప్రశాంత్‌నీల్‌తో పనిచేయడం చాలా సౌకర్యంగా అనిపించింది. సెట్‌లో ఆయన చాలా కూల్‌గా ఉంటారు. తొలిసారి ప్రశాంత్‌ దర్శకత్వంలో పనిచేసినా, చాలా సంతోషంగా అనిపించింది. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సినిమాపై ఆయనకున్న ఎన్నో ఆలోచనలను నాతో పంచుకున్నారు. అంతేకాదు, ప్రశాంత్‌ దర్శకత్వం శైలి నేను ఎన్నో నేర్చుకునేలా చేసింది.’’

అధీర పాత్రను ఎంజాయ్‌ చేస్తూ చేశా

‘‘నా కెరీర్‌లో చాలా రకాలు పాత్రలు పోషించా. అయితే, అధీర పాత్రను ఎంజాయ్‌ చేస్తూ చేశా. ప్రతి పాత్ర ఎంతో కొంత వైవిధ్యాన్ని కనబరుస్తుంది. అలాంటిదే అధీర కూడా.’’

అంతకుమించి..

‘‘కేజీయఫ్‌ 1’కు మించి ఇందులో యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. యశ్‌, నేనూ పోటా పోటీగా తలపడతాం. ఆయా సన్నివేశాలన్నీ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. రెండో భాగంలో యాక్షన్‌ మోతాదు ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇంతకుమించి ఏమీ చెప్పలేను. ఆ యాక్షన్‌ను ప్రేక్షకులు వెండితెరపై చూసి ఎంజాయ్‌ చేయాల్సిందే.’’

గంటన్నరకు పైగా మేకప్‌

‘‘ఇప్పటివరకూ నేను పోషించిన పాత్రల్లో అధీర చాలా ప్రత్యేకమైంది. భయం, దయాదాక్షిణ్యాలు లేని అతి క్రూరుడు అధీర. ఈ పాత్ర కోసం సిద్ధమవడానికి శారీరకంగా చాలా కష్టపడాల్సి వచ్చేది. మేకప్‌ వేసుకోవడానికే గంటన్నరకు పైగా పట్టేది. చాలా రోజుల తర్వాత ఇలాంటి పాత్ర పోషిస్తున్నా. ప్రశాంత్‌ నాకు కథ చెప్పగానే ఎంతో ఆసక్తిగా అనిపించింది. ఎందుకంటే అధీర పాత్ర చాలా బలంగా ఉంటుంది. అందుకే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశా. నేను గతంలో పోషించిన పాత్రలకు ఇది చాలా భిన్నమైంది’’ అని సంజయ్‌దత్‌ చెప్పుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని