సోనూసూద్‌ ఫౌండేషన్‌కు సారా విరాళం 

దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న వేళ సాయం చేసేందుకు బాలీవుడ్‌తో పాటు ఇతర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. సేవా కార్యక్రమాల్లో నటుడు సోనూసూద్‌....

Published : 09 May 2021 00:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న వేళ సాయం చేసేందుకు బాలీవుడ్‌తో పాటు ఇతర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. సేవా కార్యక్రమాల్లో నటుడు సోనూసూద్‌ అందరికంటే ముందుంటున్నారు. తన ఆస్తులు తాకట్టు పెట్టీ మరి అడిగిన వారికి సాయమందిస్తున్నారు. కాగా యువ నటీమణి, సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌..  సోనూసూద్‌కు మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని సోనూసూద్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించి సారాకు ధన్యవాదాలు తెలిపారు. ‘సోనూసూద్‌ ఫౌండేషన్‌కు విరాళం అందించిన సారా అలీఖాన్‌ను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాంటి మంచి పనులు కొనసాగించు. యువతకు నువ్వు ఆదర్శంగా నిలిచావు’ అని ప్రశంసించారు.

రూ.3.6 కోట్లు సమకూర్చిన ‘విరుష్క’

కొవిడ్‌పై పోరుకు విరాట్‌ కోహ్లీ-అనుష్క దంపతులు నడుంబిగించారు. ketto వెబ్‌సైట్‌ ద్వారా ఈ దంపతులు విరాళాల సేకరణను శుక్రవారం ప్రారంభించారు. రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.7 కోట్ల విరాళాలు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా ఈ కార్యక్రమం ప్రారంభించిన 24 గంటల్లోనే వారికి రూ.3.6 కోట్లు సమకూరాయి. ఈ విషయాన్ని విరుష్క జంట ఇస్టాగ్రామ్‌ వేదికగా తెలియజేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. విరాళాలు అందించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని వెల్లడించారు.

ఆక్సిజన్‌ సిలిండర్లు సమకూర్చిన రవీనా టాండన్‌

ప్రముఖ నటి రవీనా టాండన్‌ సైతం కొవిడ్‌పై పోరుకు ముందుకొచ్చారు. రుద్ర ఫౌండేషన్‌ సహకారంతో దిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్లను సమకూర్చారు. ఆసుపత్రికి చేరిన ఆక్సిజన్‌ సిలిండర్లను ఆమె ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘సముద్రంలో ఓ నీటి బొట్టులా.. చిన్న సాయం. కొందరి అవసరాన్నైనా తీరుస్తాయని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. అవసరమైన ఆసుపత్రులకు మరో 400 సిలిండర్లు సమకూర్చాలని తన టీంకు తెలియజేశారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని