కంగనకు భద్రత: ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తన స్వస్థలం మనాలీ చేరుకున్నారు. అనేక వివాదాల మధ్య సెప్టెంబరు 9న ముంబయి వెళ్లిన ఆమె సోమవారం ఉదయం ఇల్లు చేరుకున్నారు. ఆమెకు ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన సంగతి....

Published : 15 Sep 2020 01:25 IST

న్యాయవాది కామెంట్‌.. నటి రియాక్షన్‌

ముంబయి: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తన స్వస్థలం మనాలీ చేరుకున్నారు. అనేక వివాదాల మధ్య సెప్టెంబరు 9న ముంబయి వెళ్లిన ఆమె సోమవారం ఉదయం ఇల్లు చేరుకున్నారు. ఆమెకు ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక సెక్యూరిటీని తొలగించాలని సుప్రీం కోర్టు అడ్వొకేట్‌ బ్రిజేష్‌ కలప్ప ట్వీట్‌ చేశారు. ‘ఒక్క మనిషికి నెల రోజులపాటు ‘వై ప్లస్‌’ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వంపై రూ.10 లక్షల భారం పడుతుంది. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్ని అందుకోసం ఖర్చు చేస్తారు. ఇప్పుడు కంగన హిమాచల్‌ ప్రదేశ్‌లో సురక్షితంగా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కంగనకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీని వెనక్కి రమ్మని చెబుతుందా?’ అని పేర్కొన్నారు.

దీనికి కంగన స్పందిస్తూ.. ‘బ్రిజేష్‌ జీ.. మీరు, నేను ఊహించుకుని చెప్పేదాన్ని ఆధారంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం భద్రత ఇవ్వదు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అపాయం ఉందా?, లేదా? అనే విషయాన్ని విచారిస్తుంది. దాని ఆధారంగా నా సెక్యూరిటీ గ్రేడ్‌ను నిర్ణయిస్తారు. ఆ దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో భద్రతను పూర్తిగా తీసేయొచ్చు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో నివేదికలో నాకు ప్రమాదం ఉందని తెలిస్తే భద్రతను మరింత పెంచొచ్చు’ అని అన్నారు.

కంగన ముంబయి నుంచి చండీగఢ్ చేరుకున్న తర్వాత ట్వీట్‌ చేశారు. ‘ఇక్కడి ప్రజలు నాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈసారి బతికి బయటపడ్డ భావన నాకు కల్గింది. ఒకప్పుడు ముంబయిలో నాకు అమ్మ స్పర్శ తెలిసింది, కానీ ఇవాళ అక్కడి నుంచి ప్రాణాలతో ఇంటికి చేరుకోవడం అదృష్టంగా భావించాల్సి వచ్చింది’ అని చెప్పారు. కంగన గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యల్ని శివసేన పార్టీ నాయకులు ఇప్పటికే ఖండించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని