Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత

అలనాటి సినీనటి జమున (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Updated : 27 Jan 2023 12:50 IST

హైదరాబాద్‌: అలనాటి సినీనటి జమున (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. 

1936 ఆగస్టు 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తండ్రి పేరు నిప్పణి శ్రీనివాసరావు, తల్లి కౌసల్యాదేవి. సినిమాల్లోకి రాకముందు ఆమె పేరు జానాభాయి. జ్యోతిషుల సూచనతో ఆమె తల్లిదండ్రులు జమునగా పేరు మార్చారు. గుంటూరులోని దుగ్గిరాల బాలికల పాఠశాలలో ఆమె చదువుకున్నారు. తల్లి దగ్గరే గాత్ర సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. ‘ఖిల్జీరాజుపతనం’ నాటకంలోని ఓ పాత్రకు సీనియర్‌ నటుడు జగ్గయ్య ఆమెను ఎంపిక చేశారు. ‘మా భూమి’ నాటకం చూసి డాక్టర్‌ గరికిపాటి రాజారావు ఆమెకు మొదటి సినీ అవకాశాన్నిచ్చారు. అలా జమున మొదటిసారి 1952లో విడుదలైన ‘పుట్టిల్లు’ సినిమా కోసం పనిచేశారు.

గడుసైన పాత్రలు, ముఖ్యంగా సత్యభామ పాత్రకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆమె నిలిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో కొన్ని వందల చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీ రంగారావు, కృష్ణ సహా పలువురు దిగ్గజ నటులతో ఆమె నటించి సినీ ప్రియులను అలరించారు. నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ జమున రాణించారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజమహేంద్రవరం నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నికయ్యారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు