Shaakuntalam: అలా నేను వేసిన తొలి అడుగు ‘శాకుంతలం’: దిల్‌ రాజు

వీఎఫ్‌ఎక్స్‌ నేర్చుకునేందుకే ‘శాకుంతలం’ ప్రాజెక్టులో భాగమయ్యానని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. ఆ సినిమా 3డీ ట్రైలర్‌ విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

Published : 28 Mar 2023 22:40 IST

హైదరాబాద్‌: సమంత (Samantha) ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్‌ (Guna Sekhar) తెరకెక్కించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). దేవ్‌ మోహన్‌, మోహన్‌ బాబు, గౌతమి, మధుబాల, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం 3డీ వెర్షన్‌ ట్రైలర్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో గుణ శేఖర్‌, నిర్మాతలు దిల్‌ రాజు, నీలిమ గుణ, రచయిత సాయి మాధవ్‌ బుర్రా తదితరులు పాల్గొన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘ఇంతింతై వ‌టుడింతై అన్నట్టుగా తెలుగు సినిమా ఖ్యాతి ప్ర‌పంచ వ్యాప్తమైంది. స‌మంత మేనేజరు ఓ రోజు నా దగ్గరకు వ‌చ్చి ‘దర్శకుడు గుణ శేఖర్‌.. సమంతతో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. మీరు క‌థ వినండి’ అని అనగానే.. స‌రేన‌న్నాను. గుణ శేఖ‌ర్‌కి ఏదో విధంగా సాయం చేసేందుకే నేనీ సినిమాలో భాగం అయ్యానని చాలామంది అనుకున్నారు. కానీ, నేను స్వార్థంతో వారితో చేయి కలిపా. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్‌కు చేరుకుంది. వీఎఫ్‌ఎక్స్‌ గురించి నేర్చుకోవాల‌నే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టులో చేరా. సాధార‌ణంగా ఇలాంటి సినిమాల విషయంలో నిర్మాత‌ల‌కు పెద్ద‌గా ప‌ని ఉండ‌దు. అలా అని నేను ఖాళీగా ఉండలేదు. ‘బాహుబ‌లి’తో తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్‌’తో దాన్ని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లారు. అలా మరిన్ని తెలుగు సినిమాల‌ను ప్ర‌పంచానికి చూపించాలనే ఆలోచనతో నేను వేసిన తొలి అడుగు ఈ ‘శాకుంత‌లం’. బ్యూటీఫుల్ ఫ్యామిలీ డ్రామా విజువ‌ల్ వండ‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. మ‌న తర్వాతి తరానికి ఈ క‌థ తెలియాలి. సినిమా చూసి బ‌య‌ట‌కొచ్చేట‌ప్పుడు అల్లు అర్హ రూపంలో ఓ స‌ర్‌ప్రైజ్ ఉంటుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 19 నిమిషాలు’’ అని దిల్‌ రాజు తెలిపారు.

కొన్ని మార్పులంతే: గుణ శేఖర్‌

‘‘మహాభారతంలోని దుష్యంతుడు, శకుంతల కథను ఆధారంగా చేసుకుని కాళిదాసు.. అభిజ్ఞాన శాకుంతలం నాటకం రాశారు. దాన్ని విజువల్‌గా మీ ముందుకు తీసుకొచ్చే క్రమంలో కొన్ని మార్పులు చేశాం. 90 శాతం ఒరిజినల్‌ స్టోరీనే తెరకెక్కించాం. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. వారిని ఇంప్రెస్‌ చేయడమే నా ముందున్న సవాలు. సమంత‌.. శకుంత‌ల పాత్ర‌కు ప్రాణం పోశారు. దిల్‌ రాజుగారు నిత్య విద్యార్థి. ప్ర‌తి రోజూ ఆయ‌న కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటుంటారు. తెలుగు సినిమా వెగిలిపోతుందంటే దిల్‌రాజులాంటి నిర్మాతలే కారణం. ఆయన సినిమాని నిలబెట్టేందుకు చాలా కష్టపడతారు. నేనీ చిత్రాన్ని సమంతతో చేయబోతున్నానని తెలియగానే భాగస్వామ్యం కోసం చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపారు. దిల్‌ రాజు ఈ ప్రాజెక్టులో ఓ భాగంకావడంతో నేను సర్‌ప్రైజ్‌ అయ్యా. ఆయన కథ విని సినిమా ఎలా ఉంటుందో చెప్పేయగలరు. ఆయనలాంటి మేకర్‌ను ఉపయోగించుకోకపోతే మూర్ఖత్వమే అవుతుంది. ఆయన ఆడియన్స్‌ పల్స్‌ తెలిసిన నిర్మాత’’ అని గుణ శేఖర్‌ అన్నారు.

‘‘శాకుంతలం’ సినిమాని 3డీ వెర్షన్‌లోకి తీసుకెళ్లాలనే ఆలోచన దిల్‌ రాజుగారిదే. ఈ ట్రైలర్‌ చూశాక ఆయన విజన్‌ అర్థమైంది. సమంత ఈ వేడుకకు రావాల్సి ఉంది. కానీ, సాధ్యపడలేదు. ఆమె మనసంతా ఇక్కడే ఉంది’’ అని నీలిమ గుణ పేర్కొన్నారు. ఈ సినిమాకి పని చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన సాయి మాధవ్‌ బుర్రా.. ఈ సినిమా ప్రేక్షకుల ఊహకు మించి ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని