Bigg Boss: ఏడాదిలోనే బ్రేకప్‌ చెప్పుకొన్న బిగ్‌బాస్‌ జోడీ

ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్‌ (Biggboss) వేదికగా పరిచయమైన ఓ సెలబ్రిటీ జోడీ ఏడాదిలోనే తమ బంధానికి స్వస్తి పలికారు. తమ దారులు వేరని విధికి అనుగుణంగానే....

Updated : 27 Jul 2022 12:20 IST

ముంబయి: ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్‌ (Biggboss) వేదికగా పరిచయమైన ఓ సెలబ్రిటీ జోడీ ఏడాదిలోనే తమ బంధానికి స్వస్తి పలికింది. తమ దారులు వేరని.. అందుకనుగుణంగానే తమ ప్రయాణం కొనసాగుతుందంటూ తాజాగా ప్రకటించింది. దీంతో వీరి అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇంతకీ ఈ సెలబ్రిటీ జోడీ ఎవరంటే షమితా శెట్టి (Shamita Shetty), రాకేశ్‌ బాపత్ (Raqesh Bapat)‌.

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి సోదరిగా ఇండస్ట్రీకి పరిచయమైన చిన్నది షమితాశెట్టి. అనుకున్న స్థాయిలో విజయాలను అందుకోలేకపోయిన ఆమె గతేడాది ‘బిగ్‌బాస్‌-ఓటీటీ’లో దర్శనమిచ్చారు. అక్కడే ఆమెకు నటుడు రాకేశ్‌ బాపత్‌తో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకే వీరు ప్రేమలో ఉన్నట్లు వెల్లడించారు. త్వరలోనే వీరి పెళ్లి ఉంటుందని అంతా భావించారు. అయితే.. తాము పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామంటూ మంగళవారం ఈ జంట ప్రకటించింది. ‘‘మా బంధంపై స్పష్టత ఇవ్వడం ఎంతో ముఖ్యంగా భావిస్తున్నా. రాకేశ్‌-నేనూ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. గతకొంతకాలంగా మేమిద్దరం కలిసి లేం. ఇంతకాలం మీరు మాపై చూపించిన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. ఇకపైనా ఇదే విధంగా చూపిస్తారని అనుకుంటున్నా’’ అని షమితా పోస్ట్‌ పెట్టారు. రాకేశ్‌ కూడా ఇదే విధంగా స్పందించారు. ఇక, తెలుగులో విడుదలైన ‘పిలిస్తే పలుకుతా’తో షమితా శెట్టి ఇక్కడివారికీ సుపరిచితురాలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని