Shikhar Dhawan: బాలీవుడ్‌లో గబ్బర్‌ ఎంట్రీ.. ఆ సినిమాతోనే ధావన్‌ అరంగేట్రం

క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ సినిమాల్లోకి వచ్చేస్తున్నాడు. బాలీవుడ్‌ సినిమా డబుల్ ఎక్స్‌ఎల్‌లో అతడు నటించాడు.

Updated : 11 Oct 2022 13:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. అతి త్వరలోనే అతడు వెండితెరపై కన్పించనున్నాడు. ప్రముఖ కథానాయికలు సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌ (Double XL)’ సినిమాలో ధావన్‌ అతిథి పాత్రలో నటించాడు. ఇందుకు సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ధావన్‌.. హ్యూమాతో కలిసి డ్యాన్స్‌ చేస్తు్న్నాడు. ఈ ఫొటోను హ్యూమా రీట్వీట్‌ చేసింది.

తన సినిమా అరంగేట్రం గురించి ధావన్‌ తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు. ‘‘దేశం తరఫున ఆడే నా లాంటి అథ్లెట్‌ జీవితం క్షణం ఖాళీ లేకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నేను తీరిక చేసుకుని అప్పుడప్పుడు మంచి సినిమాలు చూస్తుంటాను. ఈ సినిమా అవకాశం నాకు వచ్చినప్పుడు ముందు కథ విన్నాను. అది నా మనసును తాకింది. ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్నిస్తుంది. మనం ఎలా ఉన్నా.. మన కలలను నెరవేర్చుకోవచ్చన్న విశ్వాసాన్ని నింపుతుంది’’ అని ధావన్‌ వివరించాడు.

సతరమ్‌ రమానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాక్షి, హ్యూమా ఖురేషి లావుగా ఉండే అమ్మాయిల్లా కన్పించనున్నారు. సమాజంలో బొద్దుగా ఉండే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన ఈ సినిమా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంటోంది.

శిఖర్‌ ధావన్‌ సినిమాల్లోకి రానున్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి. ఆ మధ్య అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘రామ్‌సేతు’ సినిమా సెట్‌లో ధావన్‌ కన్పించాడు. దీంతో ఈ సినిమాలో అతడు నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే అందులో ధావన్‌ నటించట్లేదని ఆ తర్వాత నిర్మాణ సంస్థ వెల్లడించింది. గబ్బర్‌కు నటనపై ఆసక్తి ఎక్కువే. అనేక సందర్భాల్లో సోషల్‌ మీడియాలో పలు రీల్స్‌ చేస్తూ ఆకట్టుకున్నాడు. కాగా.. ఇప్పటికే క్రికెటర్లు ఇర్ఫాన్‌ పటాన్‌, శ్రీశాంత్‌ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని