Shruti Haasan: చిరంజీవి, బాలయ్య సినిమాల్లో నటించడంపై విమర్శలు.. స్పందించిన శ్రుతిహాసన్‌

తన సినీ కెరీర్‌పై ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి శ్రుతి హాసన్‌ (Shruti Haasan). అగ్ర హీరోల సినిమాల్లో నటించే అవకాశంపై ఆమె మాట్లాడారు. 

Updated : 09 Apr 2023 17:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకులు చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna)తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం గురించి వస్తోన్న విమర్శలపై నటి శ్రుతిహాసన్‌ (Shruti Haasan) స్పందించారు. వాటి కారణంగా తాను ఏమాత్రం బాధపడటం లేదని తెలిపారు. బాలీవుడ్‌లో ఇప్పటికీ ఈ ట్రెండ్‌ కొనసాగుతోందని అన్నారు.

‘‘వయసు వ్యత్యాసాన్ని ఉద్దేశిస్తూ పలువురు చేసే కామెంట్స్‌ నన్ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే చాలా మంది ఆడియన్స్‌ ముఖ్యంగా ఆయా హీరోల అభిమానులు ఆ సినిమాలను మెచ్చుకున్నారు. వాళ్ల విమర్శలను నేను ప్రశంసగానే భావిస్తా. నటుడికి ఈ వయసు. నటికి ఈ వయసు. ఆ హీరోల పక్కన ఆమె సరిగ్గా సరిపోయిందని ఇప్పటివరకూ ఎవరూ అనలేదు. అందరూ నన్నింకా చిన్న పిల్లగానే చూస్తున్నారు దానికి నేను ఆనందిస్తున్నా (నవ్వులు). జోక్స్‌ అన్నింటినీ పక్కన పెడితే.. ఆ పాత్ర చిత్రీకరణ నాకెంతో నచ్చింది. అలాగే, ఇద్దరు లెజండరీ నటులతో నటించే అవకాశం వచ్చింది. అలాంటప్పుడు నేనెందు ఆ సినిమాలకు నో చెప్పాలి. మరో విషయం ఏమిటంటే.. ఈ విమర్శలు నాకు వ్యక్తిగతంగా ఎదురైనవి కాదు. నా రోల్‌ను అలా రాసినందుకు? డైరెక్టర్‌ మమ్మల్ని ఎంచుకున్న విధానంపైనే విమర్శలు వస్తున్నాయి. కాబట్టి, వ్యక్తిగతంగా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం తరచూ మాట్లాడుకునే బాలీవుడ్‌లోనూ వయసు వ్యత్యాసం ఉంటుంది’’ అని శ్రుతిహాసన్‌ వివరించారు.

మ్యూజిక్‌ బ్యాండ్‌ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో డబ్బు సంపాదించడం కోసం తాను సినిమాల్లోకి వచ్చానని.. నటిగా తాను చేసిన తొలి సినిమా పరాజయం అందుకుందన్నారు. ఆ సినిమా విడుదలైనప్పుడు.. నటిగా తాను 80 శాతం కూడా ఇవ్వలేకపోయానని, అందుకు తనకెంతో బాధగా అనిపించిందన్నారు. ప్రేమ విషయంపై మాట్లాడుతూ.. గ్రేట్‌ లవ్‌ని తాను పొందానని.. అందుకెంతో గర్వంగా ఉందన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ మేరకు తన సినీ కెరీర్‌, విమర్శలపై స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని