Siddharth: శర్వానంద్‌ వెడ్డింగ్‌లో సిద్ధార్ధ్‌ సింగింగ్‌.. హిట్‌ పాటతో సందడి

హీరో శర్వానంద్‌ వివాహం ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు హాజరైన సిద్ధార్థ్‌ ఓ పాట ఆడారు. సంబంధిత వీడియో తాజాగా నెట్టింట్లోకి వచ్చింది.

Published : 06 Jun 2023 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్‌ (Sharwanand) పెళ్లి వేడుకల్లో సిద్ధార్థ్‌ (Siddharth) సందడి చేశారు. మ్యూజికల్‌ కాన్సెర్ట్‌లో అక్కడి గాయకులతో కలిసి ఆయన ‘ఓయ్.. ఓయ్‌’ పాటను ఆలపించి, అతిథులను అలరించారు. సంబంధిత దృశ్యాలను కొందరు తమ ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాన్సెర్ట్‌ జరుగుతుండగా సిద్ధార్థ్‌ వేదికపైకి వేగంగా నడుస్తూ వెళ్లి.. ఓ సింగర్‌ చేతిలోని మైక్‌ తీసుకుని మరో సింగర్‌తో శ్రుతి కలపే విజువల్స్‌ వీడియోలో కనిపించాయి. దీన్ని చూసిన పలువురు అభిమానులు, నెటిజన్లు.. ‘సూపర్‌ సర్‌’, ‘సిద్ధార్థ్‌ మల్టీటాలెంటెడ్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాను హీరోగా నటించిన ‘ఓయ్‌’ (oye!) సినిమాలోని ఆ పాటను తానే ఆలపించిన సంగతి తెలిసిందే. తన సినిమా ఈవెంట్లలోనూ సిద్ధార్థ్‌ పాటలు పాడి, డైలాగ్స్‌ చెప్పి అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంటారు.

శర్వానంద్‌- సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రక్షితల వివాహం ఈ నెల 3న  జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. సిద్ధార్థ్‌, రామ్‌చరణ్‌ (ram charan), అదితిరావు హైదరిలతోపాటు మరికొందరు సినీ ప్రముఖులు ఆ వేడుకకు హాజరై, సందడి చేశారు. దానికి సంబంధించిన విజువల్స్‌ ఇప్పుడు బయటకొస్తున్నాయి. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కలిసి ‘మహా సముద్రం’ (Maha Samudram) చిత్రంలో కలిసి నటించడంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. కొత్త సినిమాల విషయాకొనిస్తే.. సిద్ధార్థ్‌ హీరోగా దర్శకుడు కార్తీక్‌ జి. క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం.. ‘టక్కర్‌’ (takkar). దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. పూర్తిస్థాయి యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలకానుంది. ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత శర్వానంద్‌.. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. షూటింగ్‌ త్వరలోనే ప్రారంభంకానుంది. దర్శకుడు కె.వి. గుహన్‌తో శర్వా ఓ సినిమా చేయనున్నారని సమాచారం. దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని