Tillu square: టిల్లు స్క్వేర్‌.. అనుపమతో గొడవలపై స్పందించిన సిద్ధు జొన్నలగడ్డ

‘టిల్లు స్క్వేర్‌’ (tillu square)తో బిజీగా ఉన్నారు నటుడు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). ఈ ప్రాజెక్ట్‌ విషయంలో నటి అనుపమ పరమేశ్వరన్‌తో ఆయనకు గొడవలు జరిగాయంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. 

Published : 15 Apr 2023 02:02 IST

హైదరాబాద్‌: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్లు ఉండొచ్చు కానీ.. ‘డీజే టిల్లు’ అంటే తెలియనివారు ఉండరు. సిద్ధు హీరోగా తెరకెక్కిన ‘డీజే టిల్లు’ (DJ tillu) సినిమా అంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘టిల్లు స్క్వేర్‌’ (tillu square) పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా సిద్ధు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

దర్శకుడు.. హీరోయిన్స్‌తో గొడవలు..!

‘‘టిల్లు స్క్వేర్‌.. ఇది ‘డీజే టిల్లు’కు పార్ట్‌ 2 కాదు. ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌. కొత్త హీరోయిన్‌. కొత్త సమస్యలు. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. నాకూ విమల్‌కు మధ్య విభేదాలు తలెత్తి తను ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగాడని వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదు. ‘టిల్లు స్క్వేర్‌’ (tillu square) చేయాలనుకున్నప్పుడు మొదట సంప్రదించింది అతడినే. ‘మళ్లీ అదే ప్రాజెక్టా..? మనం ఏదైనా కొత్తగా చేద్దాం’ అని విమల్‌ బదులిచ్చాడు. అతడి ఇష్టాన్ని గౌరవించి భవిష్యత్తులో కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్‌ చేద్దామని చెప్పా. అలా, ‘టిల్లు స్క్వేర్‌’లో మల్లిక్‌ భాగమై.. దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఇక, ఈ సినిమా హీరోయిన్‌ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. నేహాని నేనే ఈ ప్రాజెక్ట్‌ నుంచి తీసేశానని, అనుపమతో గొడవలు అయ్యాయని, ఆమె సెట్‌ నుంచి వెళ్లిపోయిందని.. ఇలా రకరకాల గాసిప్స్‌ వినిపించాయి. వాటిని చూసినప్పుడు నేను నవ్వుకున్నాను. ఎందుకంటే అవన్నీ వదంతులు మాత్రమే. ఈ సినిమా అనుకున్నప్పుడు మొదట మేము సంప్రదించింది.. ఇప్పుడు షూట్‌ చేస్తోంది అనుపమతోనే’’

టిల్లు అలా వచ్చింది..!

‘‘దర్శకుడు విమల్‌ కృష్ణ నేనూ స్నేహితులం. ఏదైనా విభిన్నమైన ప్రాజెక్ట్‌ చేయాలనే ఆలోచన మాకు ఉండేది. అలా మేమిద్దరం కలిసి ‘డీజే టిల్లు’ చేశాం. లాక్‌డౌన్‌లో కూర్చొని సీన్స్‌ రాసుకుంటూ ఉండేవాళ్లం. ఎలాంటి రూల్స్‌ ఫాలో కాకుండా మాకు నచ్చినట్టుగా దాన్ని రాసుకున్నాం. అలా, ఆ సినిమా వచ్చింది. విపరీతమైన ప్రేక్షకాదరణ అందుకుంది. అందరూ నన్ను డీజే టిల్లు అనే పిలుస్తున్నారు. అందుకు ఎంతో సంతోషిస్తున్నా’’ అని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని