Sobhita Dhulipala: మోడలింగ్‌ వదిలేయడానికి అసలైన కారణమదే: శోభితా ధూళిపాళ్ల

తన కెరీర్‌ ఎలా మొదలైందో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) వెల్లడించారు. ‘మిస్‌ ఇండియా ఎర్త్‌ 2013’ గెలుపొందిన తర్వాత సినిమాల్లోకి రావడానికి ఒక కారణం ఉందని చెప్పారు.

Published : 01 Jun 2023 20:04 IST

తిరువనంతపురం: దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ ప్రాజెక్ట్‌లు చేస్తూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala). తాజాగా ఈ భామ ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొని తన కెరీర్‌ ఎలా మొదలైందో చెప్పారు. మొదట్లో తాను మోడలింగ్‌ చేశానని ఒక కారణం వల్లే దాన్ని వదిలేసి.. సినిమాల్లోకి వచ్చేశానని ఆమె చెప్పారు.

‘‘కెరీర్‌పరంగా ఏదైనా విభిన్నంగా చేయాలనే భావన నాది. అలా, ఫ్యాషన్‌ రంగం వైపు అడుగులు వేయాలనే ఆశ కలిగింది. మ్యాగజైన్స్‌లో మోడల్స్‌ ఫొటోలు చూసి ఆశ్చర్యపోయేదాన్ని. వాళ్లలా నేనూ మోడల్‌ కావాలని కలలు కన్నాను. కళాశాల చదువు చివరి దశలో ఉన్నప్పుడు ‘మిస్‌ ఇండియా’లో పాల్గొన్నాను. కొంతకాలానికి మోడలింగ్‌లో నాకు అనుకున్నంత సంతృప్తి లభించలేదు. దాంతో యాడ్స్‌, సినిమాల కోసం ఆడిషన్స్‌ ఇవ్వడం మొదలుపెట్టాను. ఎన్నో ఆడిషన్స్‌ తర్వాత మొదటిసారి నటిగా అవకాశం అందుకున్నాను’’ అని శోభితా వివరించారు.

తన సినీ ప్రయాణాన్ని రోలర్‌ కోస్టర్‌ రైడ్‌గా అభివర్ణించిన ఆమె ఇప్పటివరకూ ఎన్నో ఎత్తుపల్లాలు, కష్ట సుఖాలు చూసినట్లు తెలిపారు. అలాగే, వచ్చిన ప్రతి సమస్యను తానే స్వయంగా పరిష్కరించుకున్నట్లు చెప్పారు. ఇక, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ గాయకుడు విజయ్‌ ఏసుదాసు.. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో తాను నటించానని కాకపోతే, సినిమా నుంచి తన పోర్షన్‌ను తీసేశారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని