Shruti Haasan: శ్రుతిహాసన్‌.. ఇప్పుడు రోజు తేడాతో.. అప్పుడు ఒకేరోజు!

ప్రముఖ కథానాయికల్లో ఒకరైన శ్రుతిహాసన్‌ నటించిన రెండు పెద్ద చిత్రాలు రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. గతంలోనూ ఆమెకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

Published : 12 Jan 2023 00:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది సంక్రాంతికి ఒక్క రోజు తేడాతో రెండు సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదం పంచబోతున్నారు నటి శ్రుతిహాసన్‌ (Shruti Haasan). బాలకృష్ణ (Balakrishna) సరసన ఆమె నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) జనవరి 12న, చిరంజీవి (Chiranjeevi)తో కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) జనవరి 13న విడుదలకాబోతున్నాయి. ఇలా ఒకే హీరోయిన్‌ నటించిన రెండు సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడం అరుదు. గతంలో నాన్‌ సంక్రాంతి సీజన్‌లోనూ శ్రుతిహాసన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇప్పుడు ఒక్క రోజు తేడాతో రెండు తెలుగు చిత్రాలతో వస్తుంటే అప్పుడు ఒక్క రోజే రెండు హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారామె. ఆ చిత్రాలేవో కాదు.. ‘రామయ్యా వస్తావయ్యా’, ‘డి- డే’. ఈ రెండూ 2013 జులై 19న విడుదలయ్యాయి.

తెలుగులో మంచి విజయం అందుకున్న రొమాంటిక్‌ డ్రామా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ రీమేక్‌గా రూపొందిన చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. గిరీశ్‌కుమార్‌ కథానాయకుడు. రిషి కపూర్‌, ఇర్ఫాన్‌ఖాన్‌, అర్జున్‌ రాంపాల్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘డి- డే’లో శ్రుతిహాసన్‌, హ్యుమా ఖురేషి కథానాయికలుగా నటించారు. 2021లోనూ కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు చిత్రాలతో సందడి చేశారు శ్రుతి. రవితేజ సరసన ఆమె నటించిన తెలుగు చిత్రం ‘క్రాక్‌’ ఆ ఏడాది జనవరి 9న, విద్యుత్‌ జమ్మాల్‌తో కలిసి నటించిన హిందీ సినిమా ‘ది పవర్‌’ జనవరి 14న (ఓటీటీలో) విడుదలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని