Cinema news: 2021లో అదరగొట్టిన 15 బెస్ట్‌  థ్రిల్లర్స్‌

ఈ ఏడాది అదరగొట్టిన 15  బెస్ట్‌ థ్రిల్లర్స్‌

Published : 03 Nov 2021 10:07 IST

థ్రిల్లర్‌ సినిమాలను భారతీయ సినీ ప్రేక్షకుల ప్రత్యేక ఆసక్తితో వీక్షిస్తారు. కథతో కట్టిపడేస్తూనే, కథనంతో రక్తికట్టించే సినిమాలొస్తే ఇక పండగే. మంచి థ్రిల్‌తో పాటు, ఊహకందని మలుపులుతో థ్రిల్లర్‌ సినిమాలు ఆకట్టుకుంటాయి. మలయాళంలో ఈ తరహా సినిమాలు వీక్షకుడికి మంచి వినోదాన్ని పంచాయి. తెలుగులో, హిందీ భాషల్లోనూ ఈ ఏడాది మంచి ప్రయోగాలే జరిగాయి. 2021లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న అలాంటి థ్రిల్లర్ సినిమాలేంటో చూద్దాం. 

కుటుంబం కోసం పోరాటం

మాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మోహనలాల్‌ నటించిన ‘దృశ్యం’(2014) ఓ సంచలనం. తెలుగు, హిందీ, తమిళంతో పాటు మొత్తం ఆరుభాషల్లో రీమేక్‌ అయింది. దీనికి కొనసాగింపుగా ‘దృశ్యం2’ విడుదలైంది. తల తిప్పుకోనివ్వని కథనంతో రూపొందిన అద్భుతమైన థ్రిల్లర్‌. మోహన్‌లాల్‌ నటన గురించి ఎంత చెప్పిన తక్కువే.  ఇంట్లో జరిగిన హత్య నుంచి కుటుంబాన్ని కాపాడుకునే పాత్రలో మరోసారి అదరగొట్టాడు. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. తెలుగులో ఇదే పేరుతో వెంకటేశ్‌ రీమేక్‌ చేశారు. విడుదల అవటమే తరువాయి.


నాయట్టు.. థ్రిల్లింగ్‌ వేట

జోజు జార్జ్‌, కుంచకో బోబన్‌, నిమిషా సజయన్‌ ప్రధాన పాత్రలుగా మలయాళంలో వచ్చిన పొలిటికల్‌ థ్రిల్లర్ ‘నాయట్టు’. ఈ ఏడాది వచ్చిన బెస్ట్‌ థ్రిల్లర్స్‌లో ఒకటి. ‘నాయట్టు’ అంటే వేట అని అర్థం.  రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణం ముగ్గురు పోలీసులను చివరి దాకా ఎలా వెంటాడిందనేది థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సాటి పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. కులాన్ని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారనేది ఆలోచన రేకెత్తించేలా తెరకెక్కించారు. కేరళలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. 


ఒక వ్యక్తిని 200 మంది చంపేస్తే

హిందీలో వచ్చిన మరో అద్భుతమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘200 హల్లా హో’. మరాఠీ సంచలన ప్రేమకథ ‘సైరాట్‌’ హీరోయిన్‌ రింకు రాజ్‌గురు ప్రధాన పాత్రలో నటించింది. పదిహేనేళ్లుగా ఊళ్లోని మహిళలను, యువతిని లైంగికంగా వేధిస్తున్న ఒక గ్యాంగ్‌స్టర్‌ 200 మంది కలిసి చంపేస్తారు. ఆయన్ను ఎందుకు చంపారనేది తెలుసుకునే కొద్దీ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నిజజీవితంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అణగారిన వర్గాలపై జరిగే లైంగిక దోపిడితో పాటు అనేక అంశాలను బలంగా చర్చించిన సినిమా. అలనాటి బాలీవుడ్‌ నటుడు అమోల్‌ పాలేకర్‌ ముఖ్య ప్రత్యేకపాత్రలో మెప్పిస్తాడు. జీ5లో ప్రసారం అవుతోంది. 


స్నేహితురాలి కోసం ‘తిట్టం ఇరండు’

తమిళంలో ఈ ఏడాది వచ్చిన మంచి థ్రిల్లర్‌ ‘తిట్టం ఇరండు’. ఐశ్వర్య రాజేశ్‌ అథిర అనే పోలీసాఫీసర్‌గా నటించింది. స్నేహితురాలిని చంపిన హంతకుడిని అథిర ఎలా పట్టుకుందనే కథాంశంతో తెరకెక్కింది.  షాక్‌కి గురిచేసే మలుపులతో ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఊహకందని క్లైమాక్స్‌ ట్విస్ట్‌ సినిమాను మరోమెట్టు ఎక్కిస్తుంది. సోనిలివ్‌లో ప్రసారమవుతోంది. ఐశ్వర్యరాజేశ్‌ కథనాయికగా ఇదే ఏడాది ‘భూమిక’ అనే ఎకో థ్రిల్లర్ విడుదలైంది. ఇది కూడా మంచి థ్రిల్లర్.


ఉగ్రవాదులను వేటాడే ‘వైల్డ్‌డాగ్‌’

నాగార్జున హీరోగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వైల్డ్‌ డాగ్‌’. థియేటర్లో అంతగా ఆకట్టుకోలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత నెటిజన్ల ప్రశంసలందుకుంది. నాగ్‌ ఇందులో ఏసీపీ విజయ్‌ వర్మగా నటించాడు. వైల్డ్‌డాగ్‌ అని మరో పేరుంటుంది.  ఉగ్రదాడుల సూత్రధారిని పట్టుకునేందుకు వైల్డ్‌డాగ్‌ తన బృందంతో కలిసి నేపాల్‌కి వెళ్తాడు. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు ఏం చేశారననేది చివరి వరకు థ్రిల్లింగ్‌గా సాగుతుంది. 


మనిషిలోని పశువుని ఆవిష్కరించే ‘కల’

కేరళ హీరో టొవినో థామస్‌ ఎంచుకునే కథాంశాలన్నీ విభిన్నంగా ఉంటాయి. ఈ ఏడాది టోవినో ఒక అదిరిపోయే యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఒక మూగజీవిని అకారణంగా చంపేస్తే, దాన్ని ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఎలా ప్రతీకారం తీసుకున్నాడనేదే ఈ సినిమా కథ. యాక్షన్‌ ప్రియులకు కన్నుల పండగలాంటి చిత్రమిది.  డాన్ విన్సెంట్ అందించిన నేపథ్య సంగీతం, అఖిల్‌ జార్జ్‌  కెమెరా పనితనం సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. టోవినో థామస్‌ ఎప్పటిలాగే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అదరగొట్టాడు. తెలుగు వెర్షన్‌ ఆహాలో ఉంది. 


గతం నుంచి కాల్‌ వస్తే.. ప్లేబ్యాక్‌

టాలీవుడ్‌లో ఈ ఏడాది వచ్చిన మంచి ఫాంటసీ థ్రిల్లర్‌ ‘ప్లే బ్యాక్’‌. దినేష్‌ తేజ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో ‘వకీల్‌సాబ్‌’ భామ అనన్య నాగళ్ల హీరోయిన్‌. ప్రస్తుతం క్రైమ్‌ రిపోర్టర్‌గా పనిచేసే కార్తిక్‌కి 1993లో సుజాత అనే స్కూల్‌టీచర్‌ నుంచి ఫోన్‌ వస్తుంది. క్రాస్‌ టైం కనెక్షన్‌ ఆధారంగా తెరకెక్కిన మొదటి చిత్రం. మనదేశంలో ఇలాంటి కథాంశంతో సినిమా రాలేదు. ఎంచుకున్న కథతోనే దర్శకుడు ప్రేక్షకుడిని హుక్‌ చేసి, పట్టుసడలని కథనంతో మంచి థ్రిల్‌కి చేస్తాడు. ఆహాలో ప్రసారమవుతోంది. మీరూ ఓ లుక్కేయండి మరి.  


ఇండియన్‌ మెక్‌బెత్‌ ‘జోజి’

దిలీశ్‌ పోతన్‌, ఫహద్‌ ఫాజిల్‌, శ్యామ్‌ పుష్కరణ్‌ మలయాళంలో మంచి మిత్ర త్రయం. ‘మహేశింటి ప్రతీకారమ్’‌, ‘తొండి ముథలం ద్రిక్సాక్షియుం’ లాంటి అద్భుతమైన సినిమాలందించారు.  ఈ ముగ్గురు కలిసి తీసిన మరో సూపర్‌ హిట్‌ థ్రిల్లర్‌ ‘జోజి’. ఆస్తి కోసం కుటుంబ సభ్యులను చంపేందుకు వెనకాడని జోజి అనే యువకుడి కథ. షేక్‌స్పియర్‌ రాసిన మెక్‌బెత్‌ ఆధారంగా దిలీశ్‌ పోతన్‌ అద్భుతంగా తెరకెక్కిస్తే ఫహద్‌ ఫజిల్‌ నటనతో ఆశ్చర్యపరుస్తాడు.


భర్త మరణం చుట్టూ...హసీనా దిల్‌రుబా

వైవిధ్య కథలతో బాలీవుడ్‌లో దూసుకుపోతున్న నటి తాప్సీ. ఆమె నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘హసీనా దిల్‌రుబా’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. విక్రాంత్‌ మాస్పే, హర్షవర్ధన్‌ రాణే ముఖ్యపాత్రల్లో నటించారు. భర్త మరణం చుట్టూ తిరిగే ఈ థ్రిల్లింగ్‌ మర్డర్‌ మిస్టరీలో తాప్సీ నటనతో మరోసారి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తాప్సీ భర్తగా విక్రాంత్‌ మాస్సే అదరగొట్టాడు. కథాగమనంలో పాత్రలు పరిణితి చెందే కొద్దీ వీరిద్దరి నటనలో చూపించే వైవిధ్యం కట్టిపడేస్తుంది. 


సైబర్ నేరాల ‘ఆపరేషన్‌ జావా’

మలయాళంలో వచ్చిన బెస్ట్‌ థ్రిల్లర్‌ ‘ఆపరేషన్‌ జావా’. చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించింది. వాస్తవ జీవితంలో జరిగే సైబర్‌ నేరాల చుట్టూ ఓ అద్భుతమైన కథ అల్లుకొని మంచి థ్రిల్లర్‌ను అందించారు. ఆన్‌లైన్‌లో డబ్బుల కాజేయడం, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం, అశ్లీల వీడియోల్లో ఫేస్‌ మార్ఫింగ్..  ఇలా రోజూ సమాజంలో జరిగే సైబర్‌ నేరాలు, వాటి చుట్టూ ఉండే విషాదాన్ని చూపేడుతూనే.. నేరస్తులను పట్టుకునేందుకు ఏం చేసారనేది మంచి థ్రిల్‌కి గురిచేస్తుంది. 


 మరికొన్ని థ్రిల్లర్స్‌

నీడ

కోల్డ్‌కేస్‌


అనుకోని అతిథి

కురుత్తి

చెహ్రే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని