KGF: ‘ఇప్పుడేం చేస్తాడు మీ హీరో?’.. ‘కేజీయఫ్‌’ ఛాప్టర్‌ 1లో జరిగింది ఇది!

‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’.. ఈ ప్రశ్న ‘బాహుబలి 2’పై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తిని పెంచిందో ‘కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌’ (కేజీయఫ్‌) ఎవరికి సొంతమవుందనే ప్రశ్న ఇప్పుడు ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’పై అంతకుమించిన ఆసక్తిని పెంచింది..

Published : 08 Apr 2022 11:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడు?’.. ఈ ప్రశ్న ‘బాహుబలి 2’పై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తిని పెంచిందో ‘కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌’ (కేజీయఫ్‌) ఎవరికి సొంతమవుతుందనే ప్రశ్న ఇప్పుడు ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’పై అంతే ఆసక్తిని పెంచింది. ఈ ఆసక్తికర ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలియనుంది. నటుడు యశ్‌- దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’కు కొనసాగింపుగా హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించిన ఈ పాన్‌ ఇండియా సినిమా ఏప్రిల్‌ 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా ‘ఛాప్టర్‌ 1’లోని ప్రధాన పాత్రలను గుర్తుచేసుకుందాం..

రాఖీ.. ఓ బ్రాండ్‌

బ్రాండెడ్‌ వస్తువులను ఎలా మర్చిపోలేమో.. ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’ చూసిన వారు హీరో పాత్రనూ మర్చిపోలేరు. ఎందుకంటే అది కూడా ఓ ‘బ్రాండ్‌’! హీరోలా కనిపించే విలన్‌.. విలన్‌లా కనిపించే హీరో క్యారెక్టర్‌ అది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, ఆమెకు ఇచ్చిన మాట కోసం పవర్‌, మనీ సంపాదించేందుకు ముంబయి వెళ్లడం.. అక్కడ అంచలంచెలుగా ఎదిగి పెద్ద డాన్‌లా మారడం.. ‘నరాచీ లైమ్‌ స్టోన్‌ కార్పొరేషన్‌’ సామ్రాజ్యాధినేత కొడుకును చంపితే ముంబయిను తన గుప్పిట్లోకి తెచ్చుకునే అవకాశం రావడం.. ఇలా పూర్తిస్థాయి యాక్షన్‌ నేపథ్యంలో సాగే పాత్ర ఇది. చిన్నప్పటి రాఖీ పాత్రను అన్మోల్‌ విజయ్‌ పోషించగా, అసలైన రాఖీ క్యారెక్టర్‌లో యశ్‌ నట విశ్వరూపం చూపించాడు. పొడవాటి జుత్తు.. గడ్డంతో కూడిన స్టైలిష్‌ లుక్‌, పవర్‌ఫుల్‌ సంభాషణలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రధాన విలన్‌ను హత్యచేసి, ‘ఛాప్టర్‌ 2’లో ఏం చేస్తాడోనన్న ఆసక్తిని పెంచాడు.


సూర్యవర్ధన్‌.. నరాచీ

సూర్యవర్ధన్‌.. కోలార్‌ ప్రాంతంలో బంగారాన్ని గుర్తించిన ప్రభుత్వ అధికారులను చంపి, ఎవరికీ అనుమానం రాకుండా బంగారు గనులను ‘నరాచీ లైమ్‌స్టోన్‌ కార్పొరేషన్‌’గా మార్చి పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఈ క్యారెక్టర్‌ నిడివి తక్కువే కానీ కీలకం. అక్రమంగా ‘బంగారు’ కోట కట్టుకున్న సూర్యవర్ధన్‌ కొన్నాళ్లు అనారోగ్యంతో బాధపడి, మరణిస్తాడు. నెగెటివ్‌ ఛాయలున్న ఈ పాత్రను దర్శక-నటుడు రమేశ్‌ ఇందిర పోషించారు. పార్ట్‌ 2లో ఈ పాత్ర కనిపించదు.


సూర్యవర్ధన్‌ బలగం..

బంగారం అక్రమ రవాణాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు, నరాచీలోకి ఎవరూ ప్రవేశించకుండా ఉండేందుకు సూర్యవర్ధన్‌ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాడు. వ్యాపారాన్ని భద్రంగా కాపాడుకోవడానికి ఐదుగురు భాగస్వాములను మూలస్తంభాలుగా ఎంచుకుంటాడు. భార్గవ్‌.. అతను చనిపోయాక కొడుకు కమల్‌, రాజేంద్ర దేశాయ్‌, ఆండ్రూస్‌, గురు పాండియన్‌. వీరు కాక సూర్యవర్థన్‌కు ఉన్న అతిపెద్ద బలం అతని తమ్ముడు అధీర. అతని సామర్థ్యంతో కట్టిన కోటకు సూర్యవర్థన్‌ కొడుకు గరుడ తోడవడంతో నరాచీని ఎవ్వరూ తాకలేనంత పటిష్టంగా తయారైంది. రాజేంద్ర దేశాయ్‌గా లక్కీ లక్ష్మణ్‌, రాజకీయ నాయకుడు గురు పాండియన్‌గా అచ్యుత్‌ కుమార్‌ వైవిధ్యం చూపించారు. వీటితోపాటు పోటీపడే మరో పాత్ర వానరం. అయ్యప్ప పి.శర్మ పోషించిన ఈ క్యారెక్టర్‌ ద్వితీయార్ధంలో ఎంట్రీ ఇచ్చినా మరో స్థాయిలో నిలిచింది. గరుడ పాత్ర మినహా మిగిలినవన్నీ సీక్వెల్‌లో ఉంటాయి.


గరుడ.. గంభీరం

గరుడ.. గంభీరమైన ప్రధాన విలన్‌ పాత్ర. సూర్యవర్ధన్‌ పెద్ద కొడుకు. నటుడు రామచంద్రరాజు.. ఈ క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. ముఖ్యంగా, తనపై హత్యా ప్రయత్నం జరిగే సమయంలో గరుడ ఇచ్చిన ‘విగ్రహం’ ట్విస్ట్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. తన తదనంతరం నరాచినీ చూసుకోవాల్సిన బాధ్యతను తమ్ముడు అధీరాకు కాకుండా తనయుడికే ఇస్తాడు సూర్యవర్ధన్‌. దాంతో.. అధీరా, గరుడ మధ్య పోరు మొదలవుతుంది. మరోవైపు, గరుడను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే.. ఓ ప్రయత్నం విఫలమైనా ఎట్టకేలకు గరుడను రాఖీ హతమారుస్తాడు. దాంతో.. ఈ పాత్రా 2వ అధ్యాయంలో కనిపించదు.


ఆండ్రూస్‌.. అదుర్స్‌

సూర్యవర్ధన్‌ నమ్మిన బంటుల్లో ఆండ్రూస్‌ ఒకడు. కానీ, నరాచీపై కన్నుపడటంతో గరుడను చంపేందుకు ప్రణాళిక రచిస్తాడు. ‘ఆ పని చేయగలిగింది రాఖీ మాత్రమేన’నే నిర్ణయానికొస్తాడు. గరుడను మర్డర్‌ చేస్తే ముంబయిను చేజిక్కించుకోవచ్చనే ఆఫర్‌ను రాఖీకు ఇస్తాడు. రాఖీ ప్లాన్‌ అమలు చేయగానే.. అతని పవర్‌ను ఆండ్రూస్‌ పాత్ర ఎలివేట్‌ చేసే తీరు అదరహో అనిపిస్తుంది. ఈ విభిన్న పాత్రను బి.ఎస్‌. అవినాష్‌ పోషించారు. రెండో భాగంలోనూ ఈ ఆండ్రూస్‌ను చూడొచ్చు.


అందాల నిధి..

‘కేజీయఫ్‌’కు గ్లామర్‌ టచ్‌ ఇచ్చిన భామ శ్రీనిధి శెట్టి. మోడల్‌ అయిన నిధి ‘మిస్‌ కర్ణాటక 2015’, ‘మిస్‌ దివా 2016’ తదితర అవార్డులు గెలుచుకొని ఈ సినిమాతోనే నటిగా మారింది. రాజేంద్ర దేశాయ్‌ కూతురు రీనా దేశాయ్‌గా కనిపించింది. తన అందం అభినయంతో ఆకట్టుకుంది. రాఖీని అసహ్యించుకునే ధనవంతురాలిగా, తర్వాత.. రాఖీని ప్రేమించే మనసున్న అమ్మాయిగా విభిన్న పార్శ్వాలు చూపింది. యశ్‌కు తగ్గ జోడీ అనిపించుకుంది. సీక్వెల్‌లోనూ సందడి చేయనుంది.


అమ్మ స్ఫూర్తి 

నిజ జీవితంలో, సినిమాల్లోనూ ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఒకానొక సమయంలో ముంబయిను శాసించే విధంగా మారేందుకు, ఎదుటివారికి సాయపడేందుకు రాఖీకు స్ఫూర్తినిచ్చింది తన తల్లి శాంతమ్మ. ఈ కీలక పాత్రను అర్చనా జొయిస్‌ పోషించింది. డబ్బులేకపోతే బతకడం మాత్రమే కష్టం కాదని, చావు కూడా కష్టంగానే ఉంటుందంటూ ఈ పాత్ర చెప్పిన మాట ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంది. ఓ వ్యాధి కారణంగా ‘శాంతమ్మ’ పాత్ర చనిపోవడంతో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో కనిపించే అవకాశం ఉంది.


కథ చెప్పింది వీరే..

తెరపై కనిపించింది తక్కువ సమయమే అయినా కథను ముందుకు తీసుకెళ్లడంలో పెద్ద పాత్ర పోషించారు మాళవిక అవినాష్‌, అనంత్‌ నాగ్‌. ‘నరాచీ లైమ్‌స్టోన్‌ కార్పొరేషన్‌’.. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీయఫ్‌) అనే వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టు రాసిన రచయిత ఆనంద్‌ వాసురాజ్‌గా అనంత్‌ నాగ్‌ ఒదిగిపోయారు. ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్‌ తెలుగు డబ్బింగ్‌ చెప్పడంతో ఈ పాత్ర ప్రత్యేకంగా నిలిపింది. నరాచీలో జరిగే విషయాల గురించి తాను రాసిన వివాదాస్పద పుస్తకం ‘ఎల్‌ డొరాడో’ను ప్రభుత్వం బ్యాన్‌ చేస్తుంది. తమ ఇన్‌ఫ్లూయన్స్‌ ద్వారా ఓ వార్తాసంస్థ ఒక కాపీని చేజిక్కించుకుంటుంది. ఆ పుస్తకం ఎందుకంత వివాదాస్పదమైంది? అందులో ఉన్న నిజమేంటి? తెలుసుకునేందుకు ఆనంద్‌ను ఇంటర్వ్యూ చేస్తుంది చీఫ్‌ ఎడిటర్‌ దీపికా హెగ్డే (మాళవిక). ఈ క్రమంలో వచ్చే ‘ఇప్పుడేం చేస్తాడు మీ హీరో’ అనే సంభాషణ ఎంతగా పాపులరైందో తెలిసిన విషయమే. ‘పవర్‌ఫుల్‌ పీపుల్‌ కేమ్‌ ఫ్రమ్‌ పవర్‌ఫుల్‌ ప్లేసెస్‌’ అంటూ ఆనంద్‌ ఇచ్చిన సమాధానం ఎంతటి సంచలనం సృష్టించిందో విధితమే. ‘ఇది పరిచయం మాత్రమే అసలు కథ ముందుంది’ అంటూ రెండో అధ్యాయంపై అంచనాలు పెంచింది ఆనంద్‌ పాత్ర.

ఎంతో ఆసక్తిని పెంచుతున్న ‘కేజీయఫ్‌ 2’లో కనిపించే ముఖ్య పాత్రలు, మెరిసిన తారల గురించి ఇది మొదటి అధ్యాయం మాత్రమే..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని