ఓటీటీ వీళ్లకు స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది..!

కంటెంట్‌ ఉన్న సినిమాకు వేదిక ఓటీటీ అయినా.. థియేటర్‌ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లన్నీ మూతపడ్డాయి. అయితే.. సినిమా పరిశ్రమకు ‘ఓటీటీ’ ఊరటనిచ్చింది. అటు అభిమానులను అలరిస్తూనే.. ఇటు ఆర్టిస్టులను..

Published : 04 Jan 2021 09:28 IST

కరోనా కాలంలోనూ కంటెంట్‌తో కొట్టారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంటెంట్‌ ఉన్న సినిమాను ఓటీటీ అయినా.. థియేటర్‌ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లన్నీ మూతపడ్డాయి. అయితే.. సినిమా పరిశ్రమకు ‘ఓటీటీ’ ఊరటనిచ్చింది. అటు అభిమానులను అలరిస్తూనే.. ఇటు ఆర్టిస్టులను.. సినిమాను నమ్ముకున్న వారిని ఆదుకునే వైదికైంది. ఈక్రమంలో మంచి కంటెంట్‌తో అభిమానులను అలరించి ఊహించని స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్నవారు చాలామందే ఉన్నారు. లాక్‌డౌన్‌లో ఓటీటీల ద్వారా వాళ్ల కెరీర్‌ను ‘కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత’లా మార్చుకున్నారు. ఇలా.. తమ డిమాండ్‌ను పెంచుకున్న వారిలో.. ప్రతిక్ గాంధీ, పంకజ్ త్రిపాఠి, జైదీప్ అహ్లవత్ ముందువరుసలో ఉంటారు. అలా ఊహించని సక్సెస్‌ అందుకొని ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నారు. వెబ్‌సిరీస్‌లు చూసే ప్రేక్షకులకు వీళ్లను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఓటీటీల ద్వారా కొత్త టాలెంట్‌ వెలుగులోకి..

కరోనా సినిమా రంగం ఆర్థికంగా నష్టపోయేలా చేసింది. సినిమా ప్రేమికులకు థియేటర్‌లో సినిమాను ఆస్వాదించే అవకాశాన్ని దూరం చేసింది. కానీ.. ఇదే సమయంలో ఓటీటీ ద్వారా చాలా మంది కొత్త వాళ్లకు అవకాశం వచ్చింది. మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్, పంచాయత్‌, పాతాళ్‌ లోక్, ఆర్య, స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వంటి వెబ్‌సిరీస్‌లు ఇందుకు మంచి ఉదాహరణలు. ఓటీటీల ద్వారా కొత్త టాలెంట్‌ వెలుగులోకి వచ్చింది. నటులు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు, రచయితలు, ఇంకా సృజనాత్మకత ఉన్న ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. ఇదిలా ఉండగా.. మరికొన్ని నెలల్లో ప్రజలు మళ్లీ సాధారణ జీవనం గడిపే అవకాశం కనిపిస్తోంది. థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడంతా వెబ్‌సిరీస్‌లలో కనిపించిన నటులదే హావా. అయితే.. ఓటీటీల గురించి వాళ్లు ఇప్పుడేం అంటున్నారో తెలుసా..?

కంటెంట్‌ ఉంటే ఆదరిస్తారు..

పంకజ్‌ త్రిపాఠి.. ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్నప్పటికీ దేశవ్యాప్త గుర్తింపు తెచ్చింది మాత్రం ‘మీర్జాపూర్‌’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సిరీస్‌తో ఆయనకు ఒక్కసారిగా స్టార్‌డమ్‌ వచ్చి పడింది. సోషల్‌ మీడియాలోనూ ఆయన డైలాగ్‌లు, వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులను అలరించాలంటే మంచి కథతో పాటు.. ఆకట్టుకునే నటన, సృజనాత్మకత.. ఇలా అన్నీ ముఖ్యమే. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఓటీటీల్లో ఓపెనింగ్‌ కలెక్షన్ల గురించి చింతించాల్సిన అవసరం లేదు. మంచి కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు అదరిస్తారు’’ అని త్రిపాఠి అంటున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న మిర్జాపుర్‌ మంచి విజయం సాధించింది. ఒకటి, రెండు సీజన్లు ప్రేక్షకులను బాగా అలరించడంతో ఇప్పుడు మూడో సీజన్‌తో అలరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

కెమెరా ముందు.. వెనుకాలున్న టాలెంట్‌కు మంచి అవకాశం

‘స్కామ్‌ 1992’ అనగానే గుర్తొచ్చే పేరు ప్రతీక్ గాంధీ. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదేమో. హన్సాల్ మెహతా దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్‌ విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకుంది. దీంతో ప్రతీక్‌గాంధీ కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయింది. ‘‘ప్రజలు నన్ను ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ‘స్కామ్ 1992’ తర్వాత ఫోన్‌ కాల్స్‌ ఎక్కువయ్యాయి. వాటితోనే బిజీగా ఉంటున్నాను. సమయం దొరికినప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. కెమెరా ముందు, కెమెరా వెనుక ఉన్న కళాకారులకు ఇది గొప్ప అవకాశం. ఇక్కడ అన్ని రకాల కథలు చెప్పవచ్చు. టాలెంట్‌ ఉన్న కొత్త రచయితలు, నటులు, సంగీత దర్శకులు.. ఇలా ఎంతోమందికి ఇది గొప్ప అవకాశం” అని ప్రతీక్‌గాంధీ అన్నారు. కొంతకాలంగా ఎక్కడ చూసినా ‘స్కామ్‌ 1992’ గురించే చర్చ జరుగుతోంది. పలు సినిమాల్లో కనిపించినా ఆయనకు రాని గుర్తింపును ఈ సిరీస్‌ తెచ్చిపెట్టింది.

నచ్చకపోతే వెళ్లిపోతారు..

అహ్లవత్.. ‘పాతాళ్‌లోక్‌’లో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ హతీరామ్ చౌదరిగా కనిపించి ప్రేక్షకులను మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నిజానికి ఓటీటీల్లో ప్రజాస్వామ్యానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సినిమా గానీ.. వెబ్‌ సిరీస్‌గానీ చూస్తున్నప్పుడు అది ప్రేక్షకులకు నచ్చకపోతే వెంటనే దాని నుంచి వేరే దాంట్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రేక్షకులకు దగ్గర కావడానికి ఓటీటీలు మంచి వేదికలు. మంచి కథలు, కంటెంట్‌తో ప్రయోగాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే సువర్ణావకాశం’ అని అహ్లవత్ అంటున్నారు. అనుష్క శర్మ నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రశంసలు దక్కాయి. ఇందులో ఓ కేసును దర్యాప్తు చేసే పోలీసు అధికారి హాథీరామ్‌ చౌదరీ పాత్ర పోషించిన అహ్లవత్‌కు మంచి పేరొచ్చింది.

ఇదీ చదవండి..

భళ్లాలదేవుడు మళ్లీ కండలు పెంచుతున్నాడా..?

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని