మీ అభిమానుల గురించి ఆలోచించండంటూ నెటిజన్‌ ట్వీట్‌.. సుదీప్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

అభిమానులపై దృష్టి పెట్టండంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై స్ట్రాంగ్‌ కౌంటర్‌ విసిరారు నటుడు సుదీప్‌. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన అభిమానులేనని చెప్పారు.

Published : 21 Dec 2022 15:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మీ అభిమానుల గురించి ముందు ఆలోచించండంటూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌పై స్పందించారు హీరో సుదీప్‌. తాను ఎప్పుడూ అభిమానులతోనే ఉంటానంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ నేను మీకు చెప్పే అంతటివాడిని కాదు సర్‌. కానీ, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. మీరు మీలా ఉండండి. మీ అభిమానుల గురించి ఆలోచించండి. చివరకు కన్నడ చిత్రపరిశ్రమ నుంచి మీకు ఎవరూ తోడుగా నిలబడరు. కేవలం, మీ అభిమానులు తప్ప’’ అని నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

కాగా, దీనిపై స్పందించిన ఆయన.. ‘‘మై ఫ్రెండ్‌.. నా అభిమానుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను వాళ్లకు దూరంగా లేను. నేను వాళ్లతోనే, వాళ్ల కోసమే జీవిస్తున్నాను. వాళ్లే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఇంతటివాడిని చేశారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, నెటిజన్‌ ఈ విధంగా ట్వీట్‌ చేయడానికి గల కారణం ఏమిటనేది తెలియదు.

ఇటీవల కన్నడ నటుడు దర్శన్‌పై (Darshan) జరిగిన దాడి ప్రస్తుతం అక్కడి చిత్రపరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తమ అభిమాన నటుడు పునీత్‌ను ఉద్దేశిస్తూ గతంలో దర్శన్‌ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన ఓవ్యక్తి.. ఇటీవల ఓ పబ్లిక్‌ ఈవెంట్‌ పాల్గొన్న దర్శన్‌పై చెప్పు విసిరాడు. ఈ ఘటనను సుదీప్‌, శివరాజ్‌కుమార్‌, ధనుంజయ్‌, విజయ్‌తోపాటు పలువురు కన్నడ నటులు ఖండించారు. ఈక్రమంలోనే సుదీప్‌.. ‘‘దర్శన్‌, పునీత్‌ అభిమానుల మధ్య ప్రశాంత వాతావరణం లేదనే దాన్ని నేను అంగీకరిస్తా. కానీ, ఒకవేళ పునీత్‌ ఉండి ఉంటే దీన్ని సపోర్ట్‌ చేసేవారా? సమాధానం అభిమానులందరికీ తెలుసు. కన్నడ చిత్ర పరిశ్రమకు దర్శన్‌ ఎంతో సేవ చేశాడు. నటులు, అభిమానుల మధ్య విభేదాలు ఉంటాయనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. దర్శన్‌, పునీత్‌ ఇద్దరూ నాకు క్లోజ్‌ కాబట్టి నా ఫీలింగ్స్‌ పంచుకుంటున్నా. నేను ఎక్కువగా మాట్లాడి ఉండే క్షమించండి’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని