The Kerala Story: వాళ్ల కామెంట్స్‌కు కారణమదే.. కమల్‌హాసన్‌ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్‌

‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)ని ఉద్దేశిస్తూ కమల్‌హాసన్‌ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలను చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్‌ తప్పుబట్టారు.

Published : 29 May 2023 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)ని ఉద్దేశిస్తూ అగ్రకథానాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలపై చిత్ర దర్శకుడు సుదీప్తోసేన్‌ (Sudipto Sen) స్పందించారు. ఇదొక ప్రచారం చిత్రమంటూ కమల్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. సినిమా చూశాక అభిప్రాయాలు తప్పకుండా మారతాయని అన్నారు.

‘‘ది కేరళ స్టోరీ’ని ఒక ప్రచార చిత్రమంటూ ఎవరైనా కామెంట్‌ చేస్తే మొదట్లో నేను స్పందించేవాడిని. కానీ, ఇప్పుడు బదులివ్వాలనుకోవడం లేదు. ఎందుకంటే, మా చిత్రాన్ని ఎవరైతే ప్రచార చిత్రం అంటూ వ్యాఖ్యలు చేశారో వాళ్లు సినిమా చూసిన తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. సినిమా బాగుందని చెబుతున్నారు. సినిమాని చూడని వాళ్లే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో మా సినిమాపై బ్యాన్‌ విధించారు. దాంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు మా చిత్రాన్ని వీక్షించలేదు. అందువల్లే వాళ్లు దీన్ని ఒక ప్రచార చిత్రంగా భావిస్తున్నారు. అలాగే, మన దేశంలో మూసధోరణులు ఫాలో అయ్యేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. జీవితమంటే కేవలం తెలుపు లేదా నలుపులోనే ఉండాలని అనుకుంటారు. బూడిద రంగులో ఉంటుందని వారికి తెలియదు’’ అంటూ సుదీప్తోసేన్‌ వ్యాఖ్యలు చేశారు.

అదాశర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). సుదీప్తోసేన్‌ దర్శకుడు. ఎన్నో విమర్శల మధ్య ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకూ ఇది రూ.200 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుల అంచనా. కాగా, ‘ఐఫా 2023’ వేడుకల్లో పాల్గొన్న కమల్‌హాసన్‌ ఈ సినిమాపై స్పందించారు. ‘‘నేను ఎప్పుడూ ఒకే మాట చెబుతాను. నాకు ప్రచార చిత్రాలు నచ్చవు. అలాంటి వాటికి నేను పూర్తి వ్యతిరేకిని. సినిమా టైటిల్‌ కింద ‘నిజమైన కథ’ అని రాయగానే సరిపోదు. అలా రాసినంత మాత్రన అది నిజంగా జరిగిన కథ అవ్వదు’’ అని వైరల్‌ కామెంట్స్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని