బాలకృష్ణ మాటల్లో వివాదం కనిపించడం లేదు: ఎస్వీ రంగారావు మనవళ్లు

తమకు నందమూరి బాలకృష్ణతో మంచి అనుబంధం ఉందని ఎస్వీ రంగారావు మనవళ్లు తెలిపారు. ఇటీవల ఎస్వీఆర్‌ గురించి బాలకృష్ణ మాట్లాడిన దాంట్లో వివాదం లేదని అన్నారు.

Updated : 26 Jan 2023 07:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ తాత, ప్రముఖ నటుడు దివంగత ఎస్వీ రంగారావు గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడిన దాంట్లో వివాదం కనిపించడం లేదని ఆయన మనవళ్లు తెలిపారు. తమకు, బాలకృష్ణకు మంచి అనుబంధం ఉందని స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో ఆ సినిమా హీరో బాలకృష్ణ (Balakrishna).. అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావులను కించపరిచేలా మాట్లాడారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వాటిపై స్పందించిన ఎస్వీ రంగారావు మనవళ్లు జూనియర్‌ ఎస్వీ రంగారావు (నటుడు), ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు (బాబాజీ) వీడియో బైట్‌ రిలీజ్‌ చేశారు. 

వారు మాట్లాడుతూ..  ‘‘నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సక్సెస్ మీట్‌లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా మేం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి మంచి అనుబంధం ఉంది. మేం ఒక కుటుంబంగా ఉంటాం. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి ఆయన సాధారణ పోకడలో చెప్పారు. ఈ విషయంలో మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు.  మీడియాలో ఈ విషయాన్ని ఇంకా సాగిదీయవద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని చెడగొట్టొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని