
actor Satya: మూడు రోజులు మంచినీళ్లు మాత్రమే తాగి..!
ఇంటర్నెట్డెస్క్: సినిమాల్లో నటించాలని, స్టార్గా ఎదగాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. సినిమా అంటే ఆసక్తి ఉన్న వారికి అది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఆ సినిమా పురుగు కుట్టిందంటే కుదురుగా ఉండనివ్వదు. అలా రంగుల ప్రపంచంలోకి వచ్చి కష్టాలు పడిన వారెందరో. తాను కూడా అలాంటి కష్టాలే పడ్డానని అంటున్నారు హాస్య నటుడు సత్య(satya). తనదైన కామెడీ టైమింగ్, నటనతో అలరిస్తున్నారాయన. అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అని అడిగితే, ఆయన ఏం చెప్పారో తెలుసా?
‘‘దర్శకులు కె.విశ్వనాథ్, శంకర్, సుకుమార్ నాకు స్ఫూర్తి. వాళ్ల సినిమాల్ని ఎక్కువగా చూసేవాణ్ని. అప్పుడే నేనూ దర్శకుడు కావాలనుకున్నా. ఆ పిచ్చితో ఇంజినీరింగ్ మధ్యలోనే మానేసి హైదరాబాద్కి వచ్చా. మా ఇంట్లోవాళ్లు వచ్చి నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లిపోయారు. కానీ నా ఆలోచనలు మారలేదు. నాన్న రూ.10 వేలు చేతిలో పెట్టి వెళ్లిపో అన్నారు. డబ్బులు తగ్గుతున్న కొద్దీ కంగారు. అప్పటికీ నాంపల్లిలో ఒక ఆస్పత్రి దగ్గర అద్దాలు తుడిచే పనికి ఒప్పుకొన్నా. రోజుకి రూ.200 ఇచ్చేవాళ్లు.’’
‘‘ఓ రోజు రజనీకాంత్-శంకర్ కలయికలోని ‘శివాజీ’ సినిమా ట్రైలర్ చూపిస్తున్నారని తెలిసి ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ‘భూ కైలాస్’ సినిమాకి వెళ్లా. అక్కడ ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడుకోవడం విని పలకరించా. వాళ్లు ‘రేపు షూటింగ్ దగ్గరికి వచ్చేయ్’ అని అడ్రస్ చెప్పారు. అక్కడికెళ్లాక రూ.500 తీసుకొని చిత్రీకరణ జరుగుతున్న చోటుకి పంపించారు. అక్కడ జూనియర్ ఆర్టిస్టుల మధ్య కూర్చుని చిత్రీకరణని చూశా. అక్కడే మరికొందరు పరిచయం అయ్యారు. వారితో ‘నవ వసంతం’, ‘యమదొంగ’ సినిమాల చిత్రీకరణకి వెళ్లా. జూనియర్ ఆర్టిస్టుల్లోనే ఒకరు నా దగ్గరున్న డబ్బు తీసుకొని వెళ్లిపోయాడు. మూడు రోజులు మంచినీళ్లు తాగి పడుకున్నా. ఆ బాధలో అమ్మకి ఫోన్ చేశా. నా గొంతు విని గుర్తు పట్టేసింది అమ్మ. నాన్నకి చెప్పడంతో ఆయన వచ్చి తీసుకెళ్లారు. మా నాన్నకి స్నేహితుడైన చంటిగారి బంధువు నల్లశ్రీను దర్శకుడు రాజమౌళి దగ్గర మేకప్మెన్గా పనిచేస్తున్నారని తెలుసుకొని ఆయన దగ్గరికి పంపించారు. ఆయనే నాకు ‘ద్రోణ’ సినిమాకి దర్శకత్వ విభాగంలో పనిచేసే అవకాశాన్నిప్పించారు’’ అని చెప్పుకొచ్చారు.