MAA Elections: హేమ ఫొటోలు మార్ఫింగ్‌ వివాదం.. నరేశ్‌, కళ్యాణిలపై ఈసీకి ఫిర్యాదు

MAA Elections: తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని సినీ నటి హేమ ఆరోపించారు.

Updated : 06 Oct 2021 16:50 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల నేపథ్యంలో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఒకవైపు ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌, మరోవైపు మంచు విష్ణు ప్యానెల్‌ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సినీ నటి హేమ ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్‌, నటి కరాటే కళ్యాణిలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

‘‘ఈ నెల 10న జరుగుతున్న ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న నాపై కుమారి కళ్యాణి అలియాస్‌ కరాటే కళ్యాణి, వి.నరేశ్‌లు కొన్ని అవాంఛితమైన, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలతో ఒక వీడియోను విడుదల చేశారు. సినీ రంగానికి చెందిన నటీమణుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, వాటికి అసభ్యకరమైన వ్యాఖ్యలను జోడించి, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో ఈ విషయమై నేను సైబర్‌సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆ తరువాత ఇలాంటి ఘటనలు తగ్గాయి. తాజాగా ఆ ఘటనకు సంబంధించిన విషయాన్ని కళ్యాణి ప్రస్తావిస్తూ ‘నేను పోలీసుల వద్దకు వెళ్లినప్పుడు వారు నాకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫొటోలను ముందుగా సోషల్‌మీడియా నుంచి తొలగించమని సలహా ఇచ్చినట్లు’ వ్యాఖ్యానించారు. కళ్యాణి వ్యాఖ్యలను నరేశ్‌ కూడా సమర్థించారు. నేను అమర్యాదకరమైన ఫొటోలను గ్రూపుల్లో పెట్టి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు కూడా తాజా వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా అందుకు ఆధారాలున్నాయని, వాటిని బయటపెడతామని బెదిరించారు. నరేశ్‌ వైఖరి నన్ను అగౌరవ పరిచేలా, నా వ్యక్తిత్వాన్ని కించరిచేలా ఉంది. నాపై అసభ్యకరమైన ప్రచారాలు చేయకుండా కట్టడి చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. మా ఎన్నికల ప్రచార సమయంలో సంస్థ ప్రతిష్ఠ దిగజారకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉంది. వీరి వల్ల సంస్థకు చెడ్డ పేరు రావటమే కాకుండా, కొందరు సభ్యులు కూడా వీరి ధోరణిని అనుసరించే ప్రమాదం ఉంది. అందువల్ల వారికి ఈసారి ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకొమ్మని కోరుతున్నా. కృతజ్ఞతలతో హేమ’’ అని లేఖలో పేర్కొన్నారు. తనపై నరేశ్‌, కళ్యాణిలు చేసిన వ్యాఖ్యల వీడియోలను తొలగించాల్సిందిగా ఆయా యూట్యూబ్‌ యాజమాన్యాల పైనా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు హేమ తెలిపారు.

హేమ లేఖపై స్పందించిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌

మా ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు గౌరవప్రదంగా ఎన్నికల ప్రచారం చేసుకోవాలని మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సూచించారు. తన పరువుకు భంగం కలిగించేలా మంచు విష్ణు ప్యానల్ లో ఉన్న కరాటే కళ్యాణి, విష్ణు ప్యానల్‌కు మద్దతి ఇస్తున్న నరేశ్‌లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేయగా, సభ్యులు ఒకరిపై ఒకరు వ్యక్తిత్వాన్ని కించపరుచుకునేలా ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినట్లేనని కృష్ణమోహన్‌ హెచ్చరించారు. ఈ విషయంపై నిబంధనల ప్రకారం చర్య తీసుకోవాల్సి వస్తుందన్నారు. మా గౌరవాన్ని దెబ్బతీసేలా సభ్యులు ప్రచారం చేసుకోరాదని, వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా ప్రచారం సాగించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని