Tollywood: నాయిక డైరీ ‘...ఒక్కటే మరి’

తారల డైరీలు చాలా వరకు పక్కాగానే ఉంటాయి. ఇన్ని సినిమాలు చేయాలి... ఇన్ని విడుదలవుతాయనే పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగుతుంటారు. విడుదల తేదీలు కాస్త అటూ ఇటూ మారినా ఆ

Updated : 20 Dec 2021 08:03 IST

తారల డైరీలు చాలా వరకు పక్కాగానే ఉంటాయి. ఇన్ని సినిమాలు చేయాలి... ఇన్ని విడుదలవుతాయనే పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగుతుంటారు. విడుదల తేదీలు కాస్త అటూ ఇటూ మారినా ఆ లెక్కల్లో పెద్దగా మార్పులేమీ ఉండవు. కానీ కరోనా వల్ల ఏ డైరీ ఏ ఏడాదికి సంబంధించిందో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండేళ్ల కింద మొదలైన సినిమాలు ఇప్పటికీ సెట్స్‌పై ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మొదలయ్యేవి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తాయో తెలియని పరిస్థితి. ఇదంతా కరోనా తెచ్చిపెట్టిన గందరగోళమే.  ఈ నేపథ్యంలో రెండు, మూడు చిత్రాలు పూర్తిచేసినా.. ఒక్కటే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తేగలిగారు కొందరు అగ్ర కథానాయికలు...

తెలుగు పరిశ్రమలో అగ్ర కథానాయికలు ఎప్పుడూ బిజీనే. ఒక్కో ఏడాది నాలుగైదు సినిమాలు అవలీలగా చేసేస్తుంటారు. వాళ్లకున్న డిమాండ్‌ అలాంటిది. అందుకు తగ్గట్టుగా వేగమూ ప్రదర్శిస్తుంటారు. రెండేళ్లుగా కరోనా కలవరపెడుతున్నా కథానాయికలు ఎప్పట్లాగే ఫామ్‌ని కొనసాగించే ప్రయత్నం చేశారు. అందులో కొంతమంది రెండు మూడు సినిమాలతో సందడి చేయగా, కొద్దిమంది ఒకే ఒక్క ప్రాజెక్టుతో సరిపెట్టుకున్నారు.

‘అల వైకుంఠపురములో’ విజయంతో జోరు మీద కనిపించిన పూజా హెగ్డే అందుకు తగ్గట్టే కొత్త సినిమాలు చేసింది. రెండేళ్లుగా బిజీ బిజీగా గడుపుతోంది. రాధేశ్యామ్‌, ఆచార్యతోపాటు పొరుగు భాషల్లోనూ అవకాశాలు అందుకుంది. ఇవన్నీ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉండగా అది సాధ్యం కాలేదు. దాంతో జోరుమీదున్న పూజా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో సరిపెట్టుకోవల్సి వచ్చింది. వచ్చే ఏడాది మాత్రం వరుస సినిమాలతో ఆమె సందడి చేయనుంది.

* కాజల్‌కు అంతగా కలిసి రాలేదు ఈ ఏడాది. అన్నీ ఆమె అనుకున్నట్టు జరిగి ఉంటే ‘ఆచార్య’తోపాటు నాగార్జునతో కలిసి నటించిన మరో సినిమాతోనూ ఆమె సందడి చేసేది. శంకర్‌ దర్శకత్వంలో చేసిన ‘ఇండియన్‌2’ ప్రేక్షకుల ముందుకొచ్చేది. విష్ణు మంచుతో కలిసి చేసిన ‘మోసగాళ్లు’తోనే 2021ని ముగించాల్సి వచ్చింది. ‘ఆచార్య’ ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇక నాగార్జునతో కలిసి చేస్తున్న సినిమా నుంచి తప్పుకొంది. ఆమె గర్భం దాల్చడమే అందుకు కారణం. ‘ఇండియన్‌2’ చిత్రీకరణ ఆగిపోయింది.

* మరో అగ్ర కథానాయికైన సమంత ‘పుష్ప’లో ప్రత్యేక గీతంతో సందడి చేసిందంతే. ‘శాకుంతలం’ సినిమాని పూర్తి చేశారు. అది వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరో అగ్ర తార రష్మిక మందన్న నటించిన రెండు అనువాద చిత్రాలు తెలుగులో విడుదలైనా...ఆమె నేరుగా చేసిన తెలుగు చిత్రం ‘పుష్ప’ ఒక్కటే. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. అది 2022లో ప్రేక్షకుల ముందుకొస్తుంది. మరోపక్క హిందీలో ఆమె రెండు చిత్రాలు ఒప్పుకొని బాలీవుడ్‌లో బిజీ బిజీగా గడుపుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని