Tollywood: ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్‌లు బంద్‌?

ఆగస్టు 1నుంచి సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని తెలుగు సినీ నిర్మాతలు యోచిస్తున్నారు.

Updated : 17 Jul 2022 20:32 IST

హైదరాబాద్‌: ఆగస్టు 1నుంచి సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని తెలుగు సినీ నిర్మాతలు యోచిస్తున్నారు (Tollywood). ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయాలతో గత కొద్దిరోజులుగా నిర్మాతలందరూ ఇదే వ్యవహారంపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంపైనా నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ షూటింగ్‌లు నిలిపివేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ తర్వాత థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో టాలీవుడ్‌ భారీ నష్టాలను చవిచూసింది. వేసవిలో పెద్ద సినిమాలు సందడి చేయడంతో కాస్త కోలుకున్నట్లు అనిపించినా, తాజాగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మళ్లీ తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో ఆగస్టు నుంచి కొన్ని రోజుల పాటు షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు వచ్చిన చిత్రాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, ఆగస్టు 1వ తేదీ నుంచి అన్ని సినిమా షూటింగ్‌లు ఆపేయాలనుకుంటున్నారు. నిర్మాణ వ్యయం, కొవిడ్‌, ఓటీటీలు తదితర సమస్యలపై చర్చించిన తర్వాతే షూటింగ్‌లకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాతల మండలి త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జులై 1వ తేదీ నుంచి 50 రోజుల తర్వాతే సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు దాన్ని పది వారాలకు పొడిగించాలని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని