Tollywood: మల్టీఫ్లెక్స్‌ల్లో తినుబండారాల ధరలు తగ్గించండి: ఫిల్మ్‌ ఛాంబర్‌

చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు కొనసాగుతున్నాయి. గురువారం మల్టీఫ్లెక్స్ థియేటర్ల ప్రతినిధులతో సమావేశం జరిగింది.

Updated : 04 Aug 2022 19:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మల్టీఫ్లెక్స్ థియేటర్లలో దోపిడికి గురవుతున్నామనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో నుంచి దూరం చేసేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్, ఏషియన్ లాంటి మల్టీఫ్లెక్స్ సంస్థల జాతీయ ప్రతినిధులతో ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. కరోనా తర్వాత చిత్ర పరిశ్రమలో వచ్చిన మార్పులు, థియేటర్ వ్యవస్థపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే మల్టీఫ్లెక్స్‌లో విక్రయించే టికెట్ ధరలతోపాటు తినుబండారాల ధరల తగ్గింపుపై సమాలోచనలు జరిపారు. తినుబండారాల విషయంలో ప్రేక్షకులు భారంగా భావిస్తున్నారని, ఆ ధరలు సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఫిల్మ్ ఛాంబర్ మల్టీఫ్లెక్స్ ప్రతినిధులకు సూచించింది. అలాగే తినుబండారాల పరిమాణం(క్వాంటిటీ)ని కూడా తగ్గిస్తే ప్రేక్షకుడు ఖర్చును భారంగా భావించరనే విషయాన్ని వివరించింది.

ఫిల్మ్ ఛాంబర్ సూచనలపై స్పందించిన ఆయా మల్టీఫ్లెక్స్ థియేటర్ల ప్రతినిధులు... తినుబండారాల ధరల తగ్గింపు విషయంపై సానుకూలత వ్యక్తం చేశారు. తమ యాజమాన్యాలతో చర్చించి ప్రేక్షకులకు మరింత సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. అలాగే నిర్మాతలు నిర్ణయించిన టికెట్ ధరలనే సాధ్యమైనంత వరకూ అమలు చేసేలా చూస్తామన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విదేశాల తరహాలో ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానాన్ని తెలుగు రాష్ట్రాల్లో అమలు సాధ్యాసాధ్యాలపై కూడా ఫిల్మ్ ఛాంబర్ తో చర్చించినట్లు సమాచారం. ఈ నెల 10న మరోసారి సమావేశమై మల్టీఫ్లెక్స్ లో తినుబండారాల ధరల తగ్గింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని