Bollywood: యుద్ధ వీరులొస్తున్నారు..!

యుద్ధం అనేది వెండితెరకు కొత్త కథావస్తువేం కాదు. సరిగ్గా తెరకెక్కిస్తే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. బిగి సడలని కథనం..ఆకట్టుకునే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో కథను తీర్చిదిద్దితే ప్రేక్షకుడు యుద్ధంలో పోరాడుతున్న అనుభూతికి గురవుతాడు.

Updated : 25 Oct 2021 07:34 IST

యుద్ధం అనేది వెండితెరకు కొత్త కథావస్తువేం కాదు. సరిగ్గా తెరకెక్కిస్తే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. బిగి సడలని కథనం..ఆకట్టుకునే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో కథను తీర్చిదిద్దితే ప్రేక్షకుడు యుద్ధంలో పోరాడుతున్న అనుభూతికి గురవుతాడు. ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’, ‘షేర్షా’ లాంటి వార్‌ చిత్రాలు అందించిన ఉత్సాహంతో మరిన్ని యుద్ధ నేపథ్య సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాయి. కంగనా రనౌత్‌, విక్కీ కౌశల్‌, వరుణ్‌ ధావన్‌, కార్తీక్‌ ఆర్యన్‌, ఇషాన్‌ కట్టర్‌...వీళ్లందరూ యుద్ధవీరులుగా తెరపై సందడి చేయనున్నారు. 

దేశం కోసం ఎంతో శ్రమించి, అవసరమైతే ప్రాణాలు అర్పించిన వీరులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి యుద్ధవీరుల కథలో నటించడం గర్వంగా ఉందంటున్నారు యువ కథానాయకులు, నాయికలు. నాలుగు పాటలు, ఫైట్లు ఉండే రొటీన్‌ చిత్రాల కంటే ఎంత కష్టమైనా కొత్త దారిలోనే వెళతామంటూ సిద్ధమవుతున్నారు.


కంగన తేజసం

‘తలైవి’తో ప్రేక్షకుల్ని అలరించిన కంగన నటిస్తున్న వార్‌ చిత్రం ‘తేజస్‌’. పాత్ర ఎలాంటిదైనా అందులోకి కంగన ఎలా పరకాయ ప్రవేశం చేస్తుందో ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇక పాత్ర విషయానికొస్తే ఎంతవరకూ అయినా వెళుతుంది. ఎలాంటి కష్టమైనా పడుతుంది కంగన. ఈ చిత్రంలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పైలెట్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ ముగిసింది. కొత్త దర్శకుడు సర్వేష్‌ మేవ్రా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్లీ, ముంబయి, రాజస్థాన్‌ల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎయిర్‌ ఫోర్స్‌ పైలెట్‌గా కంగన లుక్‌ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటోంది.


మానెక్షా పోరాటం

‘సర్దార్‌ ఉదమ్‌సింగ్‌’గా ప్రేక్షకుల్ని అలరిస్తున్న విక్కీ కౌశల్‌ నటిస్తున్న మరో జీవిత కథ ‘సామ్‌ మానెక్షా’. భారతీయ తొలి ఫీల్డ్‌ మార్షల్‌ అయిన సామ్‌ మానెక్షా 1971 భారత్‌ పాక్‌ యుద్ధంలో చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీగా పనిచేశారు. ‘రాజీ’ లాంటి హిట్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన మేఘనా గుల్జార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలో విక్కీకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.


చరిత్రలో నిలిచిపోయి

బాలీవుడ్‌లో దూసుకుపోతున్న యువతరం కథానాయకుల్లో కార్తీక్‌ ఆర్యన్‌ ఒకడు. ఆయన నుంచి రానున్న యుద్ధ నేపథ్య చిత్రం ‘కెప్టెన్‌ ఇండియా’. ప్రముఖ దర్శకుడు హన్సల్‌ మెహతా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కార్తీక్‌ పైలెట్‌గా నటిస్తున్నాడు. భారత దేశ చరిత్రలో విజయవంతమైన రెస్క్యూ అపరేషన్‌ను ఇందులో చూపించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.


వీరజవాను కథతో!

బ్రిగేడియర్‌ బల్‌రామ్‌సింగ్‌ మెహతా జీవిత కథతో వస్తున్న చిత్రం ‘పిప్పా’. 1971 ఇండో పాక్‌ యుద్ధంలో పోరాడిన వీర జవాను కథ ఇది. ఇందులో పిప్పా అనే యుద్ధ ట్యాంక్‌ కీలకంగా నిలిచింది. అందుకే ఆ పేరే ఈ సినిమాకు పెట్టారు. ఇషాన్‌ కట్టర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌, ప్రియాన్షు తదితరులు కీలక పాత్రల్లో    నటిస్తున్నారు. ఇందులో యుద్ధ సన్నివేశాల్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అక్షయ్‌కుమార్‌ హీరోగా ‘ఎయిర్‌ లిఫ్ట్‌’ లాంటి హిట్‌ చిత్రాన్ని అందించిన రాజా మీనన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


పరమ వీరచక్ర అర్జున్‌.. వరుణ్‌

పరమ వీరచక్ర గ్రహీత అర్జున్‌ ఖెటార్‌పాల్‌ జీవితం ఆధారంగా శ్రీరామ్‌ రాఘవన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇక్కీస్‌’. ఈ చిత్రం 1971 భారత్‌, పాక్‌ యుద్ధం నేపథ్యంలోనే సాగుతుంది. ఇందులో ప్రధాన పాత్రలో వరుణ్‌ధావన్‌ నటిస్తున్నాడు. అర్జున్‌ ఖెటార్‌పాల్‌ గర్వపడేలా ఈ చిత్రాన్ని శ్రీరామ్‌రాఘవన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారనే నమ్మకం ఉంది’’అంటున్నారు వరుణ్‌. దినేష్‌ విజన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని