Seetimaarr: ఆ సత్తా ‘సీటీమార్‌’కి ఉంది: గోపీచంద్‌

 ప్రేక్షకుల్ని థియేటర్‌కి తీసుకొచ్చే సత్తా ‘సీటీమార్‌’ చిత్రానికి ఉందన్నారు నటుడు గోపీచంద్‌.

Updated : 07 Dec 2022 15:04 IST

హైదరాబాద్‌: ప్రేక్షకుల్ని థియేటర్‌కి తీసుకొచ్చే సత్తా ‘సీటీమార్‌’ చిత్రానికి ఉందన్నారు నటుడు గోపీచంద్‌. కబడ్డీ నేపథ్యంలో గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది రూపొందించిన చిత్రమిది. తమన్నా కథానాయిక. భూమిక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని చిత్రబృందం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ.. ‘2019 డిసెంబరులో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. 50శాతం చిత్రీకరణ పూర్తయ్యాక కొవిడ్‌ ప్రారంభమైంది. విడుదల సమయంలో సెకండ్‌ వేవ్‌ మొదలైంది. గత కొన్నిరోజులుగా పరిస్థితులు యథాస్థితికి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు మా కమర్షియల్‌ సినిమా వస్తోంది. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి థియేటర్లలో కూర్చోబెట్టే సత్తా ఈ చిత్రానికి ఉంది. దీన్ని ఆదరిస్తే మిమ్మల్ని అలరించేందుకు ఇంకా ఎన్నో సినిమాలు థియేటర్లలోకి వస్తాయి. మా నిర్మాతలకి ప్రత్యేక ధన్యవాదాలు. దర్శకుడు సంపత్‌తో గతంలో ‘గౌతమ్‌ నంద’ చేశా. ‘సీటీమార్‌’ కోసం ఎంతో శ్రమించాడు. నా సహ నటులు, గాయకులు, రచయితలు, సాంకేతిక బృంద సభ్యులందరికీ థ్యాంక్స్‌. మరోసారి చెబుతున్నా.. మీరు ఎంజాయ్‌ చేసే ఇంటికి వెళ్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు’ అని చెప్పుకొచ్చారు.

సంపత్‌ నంది మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర్యం రాకముందే సినిమా మనకి పరిచయమైంది. మనలో ఓ భాగమైంది. ఇండియాలో క్రికెట్‌ తర్వాత అందరూ కోరుకునే వినోదం సినిమానే. అన్ని మతాల వారు కలిసి వెళ్లేది థియేటర్‌కే. మన దర్గా అదే. మన దుర్గమ్మ గుడి అదే. మన చర్చి కూడా అదే. అలాంటి మన సినిమా థియేటర్లు ఈరోజు కష్టాల్లో ఉన్నాయి. సుమారు ఏడాదిన్నర కాలంగా కటౌట్లు కనిపించట్లేదు, పాలాభిషేకాలు లేవు, పేపర్లు చించడం లేదు. కొవిడ్ ప్రారంభంతో విధించిన లాక్‌డౌన్‌ తర్వాత ‘క్రాక్‌’ చిత్రం విజృంభించింది. మళ్లీ థియేటర్లకి పూర్వ వైభవం రావాలి. అందుకే మా నిర్మాతలకి ఎన్ని ఇబ్బందులున్నా, ఓటీటీ ఆఫర్లు వచ్చినా థియేటర్లలోనే విడుదల చేస్తున్నారు. ఈ వినాయక చవితికి విఘ్నాలు తొలగిపోవాలని కోరుకుంటున్నా. మీరంతా మెచ్చుకునే సినిమా ఇది’ అని తెలిపారు.

‘నేను, నిర్మాత చిట్టూరి శ్రీనివాస్‌ ఒకేసారి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాం. పక్కా ప్రణాళికతో సినిమాలు నిర్మిస్తారాయన. అమ్మాయిలకి స్ఫూర్తిన్నిచ్చే ఈ చిత్రానికి పనిచేసిన అందరినీ అభినందిస్తున్నా. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా గోపీచంద్‌ ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. సినిమా కోసం ఎంతో కష్టపడతారు. ఈ సినిమా మంచి హిట్‌ అందుకోవాలని కోరుకుంటున్నా’ అని బోయపాటి శ్రీను అన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత కోన వెంకట్, దర్శకులు మారుతి,  ప్రశాంత్‌ వర్మ, శ్రీవాస్‌, లింగుస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని