Puneet Rajkumar: పునీత్‌కి మాటిస్తున్నా.. ఇకపై ఆ చిన్నారుల్ని నేను చదివిస్తా: విశాల్‌

‘పునీత్‌ రాజ్‌కుమార్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. తను లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇంకా నా కళ్లలోనే మెదులుతున్నారు’ అని విశాల్‌ భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 30 Aug 2022 15:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పునీత్‌ రాజ్‌కుమార్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. తను లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇంకా నా కళ్లలోనే మెదులుతున్నారు’ అని విశాల్‌ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎనిమి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పునీత్‌కి నివాళులర్పించిన అనంతరం విశాల్‌ మాట్లాడారు. పునీత్‌ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. విశాల్‌, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ రూపొందించిన చిత్రం ‘ఎనిమి’. మృణాళిని రవి కథానాయిక. మమతా మోహన్‌ దాస్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. మిని స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌.వినోద్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుకని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా పునీత్‌కి నివాళులర్పించి, ఆయన చేసిన సేవల్ని కొనియాడారు.

ఇకపై ఆ బాధ్యత నాది: విశాల్‌

పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు సమాజానికీ తీరని లోటు. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పునీత్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. మేకప్‌ ఉన్నా, మేకప్‌ తీసేసినా, ఇంట్లో కలిసినా, బయట కలిసినా ఎప్పుడూ ఒకేలా మాట్లాడేవారు. ఎంతోమందికి ఉచిత విద్యని అందించారు. వృద్ధాశ్రమాల్ని నడిపారు. ఇవే కాదు సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు. ఇన్ని పనుల్ని ప్రభుత్వం చేసిందంటే నమ్మొచ్చు. కానీ, ఒక మనిషి చేశాడంటే నమ్మడం కష్టమే. చివరిగా తన కళ్లనీ దానం చేశారు. ఇప్పటి వరకూ చదివించిన 1800 మంది చిన్నారులని తన స్నేహితుడిగా నేను చదివిస్తానని పునీత్‌కి మాటిస్తున్నా. పునీత్‌ సేవా కార్యక్రమాలకి నా వంతు చేయూతనందిస్తా.

ఆర్య మాట్లాడుతూ.. ‘పునీత్‌ సర్‌ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఆయన మరణం తీరని లోటు. మిస్‌ యూ సర్‌’ అంటూ ఎమోషన్‌ అయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆనంద్‌ శంకర్‌, కథానాయిక మృణాళిని రవి, మమతా మోహన్‌ దాస్‌, నిర్మాత వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని