Akhanda: ‘అఖండ’తో పరిశ్రమకే ధైర్యాన్నిచ్చారు

‘‘మంచి సినిమాల్ని ఎప్పుడూ ఆదరిస్తామని నాన్న(ఎన్టీఆర్‌)గారి నుంచి నిరూపిస్తూనే ఉన్నారు. ప్రేక్షకుల అభిరుచికి నా కృతజ్ఞతలు. ‘అఖండ’ విజయం.. చలన చిత్ర పరిశ్రమ సాధించిన విజయం’’ అన్నారు బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా

Updated : 10 Dec 2021 12:25 IST

‘‘మంచి సినిమాల్ని ఎప్పుడూ ఆదరిస్తామని నాన్న(ఎన్టీఆర్‌)గారి నుంచి నిరూపిస్తూనే ఉన్నారు. ప్రేక్షకుల అభిరుచికి నా కృతజ్ఞతలు. ‘అఖండ’ విజయం.. చలన చిత్ర పరిశ్రమ సాధించిన విజయం’’ అన్నారు బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో గురువారం విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘కరోనా పరిస్థితుల్లో ఇంతటి పెద్ద విజయం ఇచ్చిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. ఈ చిత్రం పరిశ్రమకి ధైర్యాన్నిచ్చింది. అభిమానుల్ని పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా. నా నుంచి వాళ్లు ఏమీ ఆశించరు. విజయాలిచ్చినా, పరాజయాలిచ్చినా నా వెన్నంటే ఉంటూ ప్రోత్సహించారు. దర్శకుడు బోయపాటి ఏ సినిమాకీ నాకు పూర్తి కథ చెప్పలేదు. ఒకట్రెండు సన్నివేశాలు చెబుతారంతే. మా ఇద్దరి మధ్య అంత సఖ్యత ఉంటుంది. అందుకే ఇంత పెద్ద విజయం సాధ్యమైంది’’ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుడికీ థియేటర్‌కీ బంధం తెగిపోతుందనే భయాలు నెలకొన్న దశలో, ఒక మంచి సినిమా తీస్తే మళ్లీ మళ్లీ చూసి పెద్ద విజయాన్ని అందిస్తామని ‘అఖండ’తో ప్రేక్షకులు నిరూపించారు. ఈ సినిమాతో ప్రేక్షకులు మాకు డబ్బులు ఇవ్వడం కాదు, పరిశ్రమకే ధైర్యాన్నిచ్చారు. మామూలుగా నటులు ఒక మంచి పాత్ర చేస్తున్నారంటే వాళ్లు చాలా ఉత్సాహంగా ఫీల్‌ అవుతారు. అదే బాలయ్య పాత్ర చేస్తున్నారంటే ఆ పాత్రే ఉత్సాహపడుతుంది. మాస్‌ అంటే అరిచి చెప్పేది కాదు, మాస్‌ అంటే మంచి చెప్పి అరిచేలా చేసేది. ఈ సినిమాలో దేవుడు గురించి, మంచి గురించి చెప్పాం. ఆత్మ శుద్ధి, వాక్‌శుద్ధి ఉన్నవాళ్లు చెబితేనే అలాంటివి ప్రేక్షకుల్లోకి వెళతాయి. అవన్నీ ఉన్న కథానాయకుడు బాలకృష్ణ. అందుకే ప్రేక్షకులు ఇంతటి విజయాన్నిచ్చార’’న్నారు. ఈ కార్యక్రమంలో నటులు శ్రీకాంత్‌, ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, నితిన్‌ మెహతా, రాంప్రసాద్‌, ఎ.ఎస్‌.ప్రకాశ్‌, శంకర్‌, శ్రవణ్‌, నాగమహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

 - ఈనాడు, విశాఖపట్నం



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని