Pushpa: అల్లు అర్జున్‌ పుష్ప సీన్స్‌ లీక్‌.. ఆగ్రహం వ్యక్తం చేసిన బన్ని

Pushpa: పుష్ప లీక్‌లపై అల్లు అర్జున్‌ తీవ్రంగా స్పందించారు. చిత్ర బృందానికి కీలక ఆదేశాలు జారీ చేశారు

Updated : 07 Dec 2022 20:08 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. రెండు భాగాలుగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ‘పుష్ప’ చిత్రాన్ని లీకుల బెడద చుట్టుముట్టింది. ఇటీవల ఈ చిత్రంలోని ‘దాక్కో దాక్కో మేక’ పాట విడుదలకు ముందే  సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

ఈ విషయం తెలిసిన కథానాయకుడు అల్లు అర్జున్‌ ఆశ్చర్యపోయారట. లీక్‌ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో చిత్రీకరణ సమయంలోనే కాదు, ఎడిటింగ్‌ రూమ్‌లోకి కూడా మొబైల్‌ ఫోన్లను అనుమతించవద్దని చిత్ర బృందాన్ని ఆదేశించారట. లీక్‌ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అన్నారట.

దీనిపై మైత్రీ మూవీ మేకర్స్‌ చిత్ర బృందం స్పందించింది ‘‘సినిమాకు సంబంధించి పలు సన్నివేశాలు లీక్‌ అవ్వడం మమ్మల్ని బాధించింది. అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాం. నిందితులను కచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇంకొక విషయమేంటంటే, దయ చేసి ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దు. తర్వాత చాలా ఇబ్బందుల్లో పడతారు. ఏది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తేనే కిక్‌ ఉంటుంది. ముందుగా వస్తే దాని విలువ తెలియదు. తాజా ఘటనపై మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నాం. నిందుతులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం’’ అని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతల్లో ఒకరైన నిర్మాత వై.రవి శంకర్‌ అన్నారు.

ఇక ‘పుష్ప’లో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం తొలిభాగం క్రిస్మస్‌ కానుకగా డిసెంబరులో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు