Vijay Sethupathi: ‘కొత్త కథల్ని ఎవరు చెబుతున్నారమ్మా? పాత కథల్నే తిప్పి తిప్పి చెబుతున్నారు..

విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘అనబెల్‌ సేతుపతి’ ట్రైలర్‌ని వెంకటేశ్‌ విడుదల చేశారు.

Updated : 28 Oct 2023 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ సేతుపతి, తాప్సీ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అనబెల్‌ సేతుపతి’. దీపక్‌ సుందర్‌రాజన్‌ దర్శకుడు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబరు 17 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ ప్రముఖ నటుడు వెంకటేశ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా ట్రైలర్‌ని విడుదల చేశారు. కామెడీ సన్నివేశాలతో రూపొందించిన ఈ ప్రచార చిత్రం ఆద్యంతం నవ్వులు పంచుతోంది. 1948, 2021ల్లో సాగే కథ ఇది. తన భార్య అనబెల్‌ (తాప్సీ)కి సేతుపతి ఓ రాజ్‌ మహల్‌ని కానుకగా ఇస్తాడు. ఆ రాజ్‌ మహల్‌ని సొంతం చేసుకోవాలని జగపతి బాబు పరితపిస్తుంటాడు. అలా వీరి మధ్య సాగే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. వెంటనే వాళ్లు ప్రస్తుతం (2021లో) ఎలా ఉన్నారో చూపించిన తీరు మెప్పిస్తోంది. విజయ్‌ సేతుపతి, తాప్సీతో సహా చాలామంది తాము దెయ్యాలని ఒకరికి తెలియకుండా మరొకరు ఆ మహల్‌లో అడుగుపెడతారు. రాధిక, యోగిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు తాప్సీతో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రతి సీన్‌లోనూ కామెడీని పండించారు. ట్రైలర్‌ చివరిలో ‘కొత్త కొత్త కథలు చెప్పకు’ అని తాప్సీ అనగానే ‘కొత్త కథల్ని ఎవరు చెబుతున్నారమ్మా? పాత కథల్నే తిప్పి తిప్పి చెబుతున్నారు. ఏం చేయమంటావ్‌’ అని యోగిబాబు ఇచ్చిన సమాధానం అలరిస్తుంది. మరి ‘అనబెల్‌ సేతుపతి’ కొత్త కథా, పాతదేనా? ఆ రాజ్ మహల్‌ రహస్యం ఏంటి? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని