Bigg boss telugu 5: ఆ ఇద్దరు తప్ప మిగిలిన వాళ్లందరూ నామినేట్‌.. కారణాలివే!

Bigg boss telugu 5: ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్‌ అయింది వీళ్లే!

Published : 30 Nov 2021 01:45 IST

హైదరాబాద్‌: ఎవరూ ఊహించని విధంగా రవి(Ravi) ఇంటి నుంచి వెళ్లిపోయిన దానిపై బిగ్‌బాస్‌(Bigg Boss telugu 5) హౌస్‌ మేట్స్‌ మాట్లాడుకున్నారు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌తో కాకుండా జనం ఓట్లతో తాను సేవ్‌ అయ్యాయనని, అందుకు సంతోషంగా ఉందని మానస్‌(manas)తో కాజల్‌(Kajal) అన్నది. రవి వెళ్లిపోతుంటే చాలా బాధగా అనిపించిందని సిరి(siri)-షణ్ముఖ్‌(shanmukh) మాట్లాడుకున్నారు. శ్రీరామ్‌(sri ram)కు స్నేహితులుగా ఉన్న వారందరూ వెళ్లిపోయారని, తనని ఒంటరిగా వదలకూడదని అనుకున్నారు. ఇక రవి వెళ్లేవరకూ ఏడ్చిన సన్నీ(sunny), అతడు వెళ్లిపోగానే కాజల్‌తో కలిసి జోకులు వేసి, నవ్వుకున్నారని షణ్ముఖ్‌ అన్నాడు. ‘టఫ్‌ కంటెస్టెంట్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మాకు పోటీ తగ్గింది’ అని వాళ్లు అనుకుంటున్నట్లు ఉన్నారు అని సిరి చెప్పుకొచ్చింది. ఎవరు ఎవర్ని నామినేట్‌ చేస్తారంటూ సన్నీ-కాజల్‌ మాట్లాడుకున్నారు.

‘నువ్వుంటే అందరికీ ఇష్టం. నిన్ను నామినేట్‌ చేయరు’ అని సన్నీతో కాజల్‌ చెప్పింది. రవి వెళ్లిపోయిన దాన్ని గుర్తు చేసుకుని కిచెన్‌లో ఒంటరిగా ఉన్న ప్రియాంక(Priyanka) ఏడ్చింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన సిరి ఆమెను ఓదార్చింది. ఆ తర్వాత బెడ్‌ రూమ్‌లో ఉన్న ప్రియాంకతో షణ్ముఖ్ మాట్లాడాడు. ‘సన్నీ, కాజల్‌, మానస్‌లు నిన్ను నామినేట్‌ చేస్తారు. హౌస్‌లో శ్రీరామ్‌, నేను, సిరి లేకపోతే వాళ్లు తప్పకుండా నిన్నే ఎంచుకుంటారు. వాళ్ల ప్లాన్‌ అదే. ఈవిషయం నీకు అర్థం కావటం లేదు.’ అంటూ ప్రియాంకతో షణ్ముఖ్‌ చెప్పాడు. ‘కాజల్ నన్ను నామినేట్‌ చేస్తే తప్పకుండా ఆమెను చేస్తా’ అంటూ ప్రియాంక చెప్పగా, ‘సరైన కారణం చెబితే బాగుంటుంది’ అని షణ్ను అన్నాడు.

నాకు హగ్గు వద్దు బాబోయ్‌

‘సిరి-షణ్ముఖ్‌ హగ్‌ చేసుకోవడం నాకు నచ్చలేదు’ అని సిరి తల్లి అన్న మాట చాలా గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. షణ్ముఖ్‌, సిరి, కాజల్, మానస్‌ కలిసి మాట్లాడుకుంటుగా, సిరిపై షణ్ను నాలుగైదు పంచ్‌లు వేశాడు. దీంతో అలిగి వెళ్లిపోయిన ఆమె మోజ్‌ రూమ్‌లో కూర్చొంది. అక్కడకు వచ్చిన షణ్ను ఆమెకు సారీ చెప్పాడు. దీంతో సిరి హగ్‌ చేసుకునేందుకు ప్రయత్నించగా ‘నాకు హగ్‌ వద్దు బాబోయ్‌’ అని షణ్ముఖ్‌ అన్నా కూడా సిరి వదిలి పెట్టలేదు. కుర్చీలో కూర్చొన్న అతడిని లేపి మరీ హగ్‌ చేసుకుంది. ‘ఆంటీ ఇది కేవలం ఫ్రెండ్‌షిప్‌తో చేసుకున్న హగ్‌మాత్రమే’ అని షణ్ముఖ్‌ చెప్పడం గమనార్హం.

ఈ వారం నామినేషన్‌కు కారణాలివే!

ఈ వారం నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా హౌస్‌మేట్స్‌ ఫొటోలు ఉన్న బాల్స్‌ని కంటెస్టెంట్స్‌ అందరికీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. ఇంటి మెయిన్‌ గేట్లను తెరిచాడు. ఎవరికైతే ఇంటిలో కొనసాగే అర్హత లేదని భావిస్తారో వాళ్ల ఫొటోలతో ఉన్న బాల్స్‌ని ఆ గేట్‌ అవతలికి వెళ్లేలా తన్నాలి అని ఆదేశించాడు. మొదట నామినేషన్‌ ప్రక్రియను షణ్ముఖ్‌ ప్రారంభించాడు. ‘కమ్యూనిటీ, క్యాస్ట్‌, రిలీజియన్‌ గురించి ఇలాంటి వేదికలపై మాట్లాడకూడదు. కానీ నువ్వు మాట్లాడావు. అందుకే నువ్వు వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయి అని అన్నాను’ అంటూ కాజల్‌ను, ప్రతిదాన్ని సీరియస్‌గా తీసుకుంటావంటూ ప్రియాంకను షణ్ముఖ్‌ నామినేట్‌ చేశాడు. ఎవరిని నామినేట్‌ చేయాలా? అన్నదానిపై ప్రియాంక తర్జన భర్జన పడింది. దీంతో ‘ఎవరినీ నామినేట్‌ చేయకపోతే నువ్వు నేరుగా నామినేట్‌ అవుతా’వని బిగ్‌బాస్‌ హెచ్చరించాడు. దీంతో సిరి, కాజల్‌లను ప్రియాంక నామినేట్‌ చేసింది.

‘మానస్‌ అనుకున్నది అనేస్తాడు. ఎదుటి వాళ్లు మాట్లాడితే మాత్రం ఎదురు మాట్లాడకూడదు. నువ్వు హౌస్‌ నుంచి బయటకు వెళ్తే నాకు ఫరక్‌ పడదు అని అనడం నాకు నచ్చలేదు’ అంటూ మానస్‌ను, ‘కిచెన్‌లో ఉండగా బయటకు వెళ్లు’ అనడం నచ్చలేదంటూ కాజల్‌ను శ్రీరామ్‌ నామినేట్ చేశాడు.‘నియంత’ టాస్క్‌లో తనని డిస్క్‌ క్వాలిఫై చేసినందుకు ప్రతిగా ప్రియాంకను, ‘కమ్యూనిటీ’ అనే పదం వాడినందుకు రెండో వ్యక్తిగా కాజల్‌ బంతిని సిరి గేటు బయటకు తన్నింది. ‘నియంత’ టాస్క్‌లో తనని డిస్‌ క్వాలిఫై చేసినందుకు సిరిని సన్నీ నామినేట్‌ చేశాడు. శ్రీరామ్‌తో తనకు బాండింగ్‌ తక్కువగా ఉందంటూ అతడి బంతిని గేటు బయటకు తన్నాడు.  ‘శ్రీరామ్‌ మాట తీరు సరిగా లేదు’ అంటూ అతడిని, ‘ప్రియాంకను గెలిపించుకోవాలంటే గెలిపించుకో’ అంటూ తనని అన్నందుకు సిరిని మానస్‌ నామినేట్ చేశాడు. చివరిగా కాజల్‌ ప్రియాంక, సిరిలను నామినేట్‌ చేసింది. ‘కమ్యూనిటీ’ అనే పదంపై మరోసారి హౌస్‌మేట్స్‌ మధ్య చర్చ జరిగింది. అలా ఈ వారం నామినేషన్స్‌లో ప్రియాంక, సిరి, మానస్, శ్రీరామ్‌, కాజల్‌లు ఉన్నారు. కెప్టెన్‌ అయిన కారణంగా షణ్ముఖ్‌, ఎవరూ నామినేట్‌ చేయకపోవడంతో సన్నీ ఈ వారం నామినేషన్‌లో లేరు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని