Tollywood: ‘కేజీయఫ్‌ 2’ నో ఛేంజ్‌ .. ‘ఆది పురుష్‌’ డేట్‌ ఫిక్స్‌.. ‘పుష్ప’ రెండో పాట అప్‌డేట్‌

‘పుష్ప’, ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’, ‘ఆది పురుష్‌’ సినిమాల తాజా అప్‌డేట్స్‌...

Published : 27 Sep 2021 16:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని తొలిగీతం ‘దాక్కో దాక్కో మేక’ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రంలోని ఇతర పాటలపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ‘పుష్ప’ నుంచి సెకండ్‌ సింగిల్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానులకి చిత్ర బృందం ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ సినిమాలోని రెండో పాటని కొన్ని రోజుల క్రితమే అద్భుతమైన లొకేషన్‌లో చిత్రీకరించినట్టు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అందించనున్నట్టు పేర్కొంది. షూటింగ్‌ స్పాట్‌కి సంబంధించిన ఫొటోని పంచుకుంది.

‘కేజీయఫ్‌ 2’ విడుదల తేదీలో మార్పు లేదు..

యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్‌ తెరకెక్కిస్తోన్న పాన్‌ ఇండియా సినిమా ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’. శ్రీనిధి శెట్టి కథానాయిక. రవీనా టాండన్‌, సంజయ్‌ దత్, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని 2022 ఏప్రిల్‌ 14న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, మరికొన్ని భారీ చిత్రాలు అదే నెలలో వస్తుండటంతో ‘కేజీయఫ్‌ 2’ వాయిదా పడే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. అయితే ‘కేజీయఫ్ ఛాప్టర్‌ 2’ని ముందుగా అనుకున్న తేదీనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం స్పష్టం చేసింది. విజయ్‌ కిరంగదూర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

‘ఆది పురుష్‌’ విడుదల ఖరారు..

ప్రభాస్‌ హీరోగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆది పురుష్‌’. ఓం రౌత్‌ దర్శకుడు. తాజాగా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. 2022 ఆగస్టు 11న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకానుంది. రామాయణం ఇతివృత్తంగా 3 డీ ఫార్మాట్‌లో రూపొందిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ శ్రీరాముడిగా, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా, కృతి సనన్‌ సీతగా కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు