bommarillu: 35 టేకులు.. సినిమా చేయనని చెప్పేసిన జెనీలియా

టాలీవుడ్‌లో తెరకెక్కిన క్లాసిక్‌ ప్రేమకథా చిత్రాల్లో ‘బొమ్మరిల్లు’ ఒకటి. సిద్దార్థ్‌, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రానికి భాస్కర్‌ దర్శకత్వం వహించారు....

Updated : 28 Aug 2021 21:20 IST

దర్శకుడు భాస్కర్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో తెరకెక్కిన క్లాసిక్‌ ప్రేమకథా చిత్రాల్లో ‘బొమ్మరిల్లు’ ఒకటి. సిద్దార్థ్‌, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రానికి భాస్కర్‌ దర్శకత్వం వహించారు. 2006లో విడుదలైన ఈ సినిమా విజయం తర్వాత ‘బొమ్మరిల్లు’.. భాస్కర్‌ ఇంటిపేరుగా మారిపోయింది. ప్రస్తుతం ఆయన అఖిల్‌ అక్కినేనితో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాస్కర్‌.. ‘బొమ్మరిల్లు’ షూట్‌ సమయంలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర విషయం గురించి బయటపెట్టారు. షూటింగ్‌ మొదలుపెట్టిన మొదటిరోజే జెనీలియా అసహనానికి గురై సెట్‌ నుంచి వెళ్లిపోయారని, సినిమా చేయనని చెప్పేశారని భాస్కర్‌ తెలిపారు.

‘‘బొమ్మరిల్లు’ షూట్‌ మొదటిరోజు జెనీలియా సెట్‌లోకి వచ్చి అందర్నీ పలకరించారు. నాతో కొంత సమయం మాట్లాడారు. అనంతరం షూట్‌ ప్రారంభించాం. అర్ధరాత్రి పూట ఇంట్లోవాళ్లకు చెప్పకుండా హీరోహీరోయిన్‌ ఐస్‌క్రీమ్‌ తినడానికి వెళ్లే సీన్‌ని మొదట మేం షూట్‌ చేయాలనుకున్నాం. అందుకు అనుగుణంగా రాత్రి తొమ్మిది గంటలకు షూట్‌ ప్రారంభించాం. కేవలం రెండు డైలాగులు మాత్రమే ఆ సీన్‌లో ఉంటాయి. కానీ, ఆ సీన్ ఓకే కావడానికి సుమారు 35 టేకులు తీసుకోవాల్సి వచ్చింది. అక్కడే తెల్లవారిపోయింది. దాంతో జెనీలియాకు కోపం వచ్చి.. ‘రాత్రంతా షూట్‌ చేసి కేవలం రెండు డైలాగులు మాత్రమే ఉన్న సీన్‌ చేస్తారా? అస్సలు నేను ఈ సినిమా చేయను’ అని చెప్పి వెళ్లిపోయింది. ఆ సమయంలో సెట్‌లో బన్నీ ఉన్నాడు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి.. ‘భాస్కర్‌ మంచి డైరెక్టర్‌. ఒక్కరోజులోనే ఆయన వర్క్‌ని డిసైడ్‌ చేయకు. ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుంది’ అని నచ్చచెప్పడంతో ఆమె తిరిగి సెట్‌లోకి వచ్చారు. ఆ తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం’’ అని భాస్కర్‌ వివరించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని