KarunaKumar: రూ.10 వ్యయం అయ్యే పనిని, రూ.8కే చేసి చూపించాలని తపిస్తుంటా!

అంతర్జాలం విస్తృతి పెరిగాక...మనందరం జాతీయ అంతర్జాతీయ సినిమాలు చూడటం మొదలు పెట్టాక తెలుగులో ఇలాంటివి రావడం లేదే అనే ప్రశ్న మొదలైందని చెబుతున్నారు దర్శకుడు కరుణ కుమార్‌.....

Updated : 26 Aug 2021 09:55 IST

అంతర్జాలం విస్తృతి పెరిగాక...మనందరం జాతీయ అంతర్జాతీయ సినిమాలు చూడటం మొదలు పెట్టాక తెలుగులో ఇలాంటివి రావడం లేదే అనే ప్రశ్న మొదలైందని చెబుతున్నారు దర్శకుడు కరుణ కుమార్‌. ‘పలాస 1978’తో విజయాన్ని అందుకున్న దర్శకుడాయన. ఇటీవల సుధీర్‌బాబు హీరోగా ‘శ్రీదేవి సోడాసెంటర్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 27న రానుంది. ఈ సందర్భంగా కరుణకుమార్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘పది పద్నాలుగేళ్లుగా మనం కథలు చెప్పడం మరిచిపోయాం. ఒక మూస ధోరణిలో వెళ్లిపోతున్నాం. పరభాషా సినిమాల్ని చూసి మెచ్చుకుంటున్నాం తప్ప..మనం అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ‘శంకరాభరణం’, ‘సిరివెన్నెల’, ‘జ్యోతి’, ‘విజేత’, ‘ఛాలెంజ్‌’... ఇలాంటి కళాత్మకమైన సినిమాలు ఒకప్పుడు తెలుగులో వచ్చినంతగా ఏ భాషలో రాలేదు. తెలుగువాళ్లు కథలు చెబితే వినడానికి సిద్ధంగా ఉంటారని ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన ‘అరుంధతి’, ‘బాహుబలి’లాంటి చిత్రాలు నిరూపించాయి. కథల్నే చెబుదామని నేను పరిశ్రమలోకి వచ్చా. అలా ఓ బలమైన కథని చెప్పినప్పుడు ఒప్పుకుని ‘పలాస’ రూపంలో తొలి అవకాశం ఇచ్చారు నిర్మాతలు. అలా మరో బలమైన సమస్యని ‘శ్రీదేవి సోడా సెంటర్‌’లో చర్చించాం. ‘పలాస’ తరహాలో కాకుండా... కొంచెం భిన్నంగా గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇప్పటివరకు గోదావరి జిల్లాలంటే అరిటాకులు, అమ్మమ్మల ఆప్యాతలు, పొలంగట్లనే తెరపై చూశాం. అక్కడి సామాజిక, ఆర్థిక కోణాల్ని, ఆ నేపథ్యంలో భావోద్వేగాల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఈ సినిమాతో చేశాం. ఈ కథలో ఓ ప్రేమకథ కూడా ఉంటుంది.నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించాం’’.

‘‘గ్రామాల్లో అల్లరి చిల్లరిగా కనిపించే ఓ తెలివైన సాధారణమైన ఎలక్ట్రీషియన్‌గా కనిపిస్తాడు కథానాయకుడు. ఓ సోడాసెంటర్‌ యజమాని కూతురు కథానాయిక. వీరి మధ్య చిగురించిన ప్రేమే ఈ చిత్రం. ఆ ప్రేమ తాలూకు పర్యవసనాలు, దాని వెనక సాంఘిక సామాజిక ఆర్థిక పరమైన ఇబ్బందుల మధ్య ఆ జంటకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఆసక్తికరం’’.

‘‘నేను తీసే ప్రతి సినిమా భిన్నంగా ఉండాలని కోరుకుంటా. నేను రాసుకునే ప్రతి కథకీ ఆ కథే హీరో. నా కథని నమ్మిన వాళ్లతోనే సినిమాలు చేస్తాను. ‘పలాస’లో మొత్తం తెలుగువాళ్లే నటించారు. ఇందులో కూడా 99 శాతం తెలుగు నటులే. ఈ సినిమా విడుదల తర్వాతే తదుపరి సినిమా ఎవరితో అనేది చెబుతా. పది రూపాయలు వ్యయం అయ్యే పనిని, రూ.8కే చేసి చూపించాలని తపిస్తుంటా’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని