Crime news: మాదక ద్రవ్యాల కేసులో సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు

నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న

Updated : 25 Aug 2021 22:19 IST

హైదరాబాద్‌: నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని ఛార్మి, రకుల్‌, దగ్గుబాటి రానా, రవితేజ, పూరి జగన్నాథ్‌, నవదీప్‌, ముమైత్‌ ఖాన్‌, తరుణ్‌, నందులను ఈడీ ఆదేశించింది. ఈనెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ ప్రముఖులను ఈడీ విచారించనున్నట్టు తెలుస్తోంది. 2017లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ ప్రశ్నించనుంది.

రాష్ట్రంలో సినీ ప్రముఖుల డ్రగ్స్‌ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎక్సైజ్‌ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్‌ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్‌ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే, సినీ ప్రముఖులకు క్లీన్‌చీట్‌ ఇచ్చిన ఎక్సైజ్‌ అధికారులు.. పలువురు డ్రగ్స్‌ విక్రేతలపై 12 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. డ్రగ్స్‌ కేసును సీబీఐ, నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని గతంలో రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఈడీ.. కేసు విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎక్సైజ్‌ అధికారుల నుంచి వివరాలు అందడం లేదని ఈడీ ఆరోపించింది.

చివరకు ఎక్సైజ్‌ శాఖ కేసుల ఆధారంగా డ్రగ్స్‌ కేసులపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరుకావాలని పలువురు సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 31న పూరీ జగన్నాథ్, సెప్టెంబరు 2న ఛార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, 13న నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందూ, 22న తరుణ్ హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో సినీ ప్రముఖులతో పాటు, డ్రగ్స్ విక్రేతలను ఈడీ బృందాలు ప్రశ్నించనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని