The Family Man 2: సమంత వెబ్‌ సిరీస్‌.. 10 విభాగాల్లో హవా 

లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీకి ఆదరణ పెరిగింది. స్థానిక చిత్రాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంది.

Published : 13 Nov 2021 01:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్: లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీకి ఆదరణ పెరిగింది. స్థానిక చిత్రాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంది. అందుకే దర్శకనిర్మాతలు, అగ్ర నటులు సైతం ఓటీటీ వేదికగా సందడి చేస్తున్నారు. వీరి కష్టాన్ని గుర్తిస్తూ.. ప్రతిభను ప్రోత్సహించే విధంగా ఫిల్మ్‌ఫేర్‌ గతేడాది నుంచి ఓటీటీ అవార్డ్స్‌ అందిస్తోంది. 2021గానూ ఈ అవార్డ్స్‌కి నామినేట్ అయిన సిరీస్‌ల జాబితాను ఫిల్మ్‌ఫేర్‌ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు 2020 ఆగస్టు 1 నుంచి 2021 జులై 31 మధ్య విడుదలై, విశేష ప్రేక్షకాదరణ పొందిన వాటిని ఎంపిక చేసింది.

వీటిల్లో ప్రముఖ నటి సమంత కీలక పాత్ర పోషించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2’.. 10 విభాగాల్లో నామినేట్‌ అయింది. బెస్ట్‌ సిరీస్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ (రాజ్‌ అండ్‌ డీకే, సుపర్న్‌ ఎస్‌. వర్మ), బెస్ట్‌ యాక్టర్‌ - మేల్‌ (మనోజ్‌ బాజ్‌పాయ్‌), బెస్ట్‌ యాక్టర్‌ - ఫిమేల్‌ (సమంత), బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌- ఫిమేల్‌ (ఆశ్లేషా ఠాకూర్‌), బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ -మేల్‌ (షరిబ్‌ హష్మి), (సన్నీ హిందూజ), బెస్ట్‌ ఒరిజినల్‌ స్టోరీ (సుమన్‌ కుమార్‌, రాజ్‌ అండ్‌ డీకే), బెస్ట్‌ డైలాగ్స్‌ (సుపర్న్‌ ఎస్‌ వర్మ, సుమన్‌ కుమార్‌, రాజ్‌ అండ్‌ డీకే, మనోజ్‌ కలైవనన్‌), బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే (సుమన్‌ కుమార్‌, రాజ్‌ అండ్‌ డీకే, సుపర్న్‌ ఎస్‌. వర్మ) కేటగిరీల్లో ఈ సిరీస్‌ హవా కొనసాగించింది. ప్రేక్షకులు తమకు నచ్చిన సిరీస్‌కు ఓటు వేసేందుకు ఫిల్మ్‌ఫేర్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల 24, యాప్‌ ద్వారా ఈనెల 28 వరకు అవకాశం ఉంది.

మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో 2019లో విడుదలైన ‘ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 1’ విశేషంగా అలరించింది. దానికి కొనసాగింపుగా రూపొందిన సీజన్‌ 2లో సమంత కీలక పాత్ర పోషించి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. డీ గ్లామర్‌ పాత్రలో కనిపించి నటిగా తనసత్తా ఏంటో మరోసారి నిరూపించారు. ఈ సిరీస్‌కి రాజ్‌ అండ్‌ డీకే, సుపర్న్‌ ఎస్‌. వర్మ దర్శకత్వం వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని