Cinema news: సిల్వర్‌స్క్రీన్‌పై అరుదైన సీన్‌!

స్టార్‌ హీరో బొమ్మ పడితే అభిమానులకు పండగ.. ఆ అభిమాన నటుడు వారసుడితో కలిసి నటిస్తే.. ఇక విందు భోజనమే! ఫ్యాన్స్‌కి

Published : 14 Dec 2021 10:14 IST

స్టార్‌ హీరో బొమ్మ పడితే అభిమానులకు పండగ.. ఆ అభిమాన నటుడు వారసుడితో కలిసి నటిస్తే.. ఇక విందు భోజనమే! ఫ్యాన్స్‌కి అలాంటి ఫుల్‌మీల్స్‌ అందించేలా కాంబినేషన్‌ చిత్రాలు త్వరలో రాబోతున్నాయి. మరి ఆ చిత్రాలేంటో చూసేయండి.

‘చిరు’తనయుడితో కలిసి ‘ఆచార్య’

అగ్ర కథానాయకుడు చిరంజీవి(Chiranjeevi) సినిమా అంటే అదో పెద్ద పండగ. అలాంటిది తనయుడు రామ్‌చరణ్‌(Ram charan)తో కలిసి నటిస్తుంటే ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’(Acharya). కొరటాల శివ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. దేవాదాయశాఖలో జరిగే అవినీతి, అక్రమాల నేపథ్యంలో సినిమా సాగుతుందని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. కాజల్‌ అగర్వాల్‌, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. గతంలోనూ ఈ మెగా హీరోలు కలిసి నటించారు. మగధీర, బ్రూస్‌లీ సినిమాల్లో చిరంజీవి తెరపై అతిథిగా కాసేపు మెరిస్తే.. ఖైదీ నెంబర్‌ 150లో రామ్‌చరణ్‌ గెస్ట్‌గా తండ్రితో కలిసి స్టెప్‌లు వేశారు. ఫిబ్రవరి 4, 2020న ‘ఆచార్య’ప్రేక్షకుల ముందుకు రానుంది.


అక్కినేని ఫ్యామిలీ చిత్రం ‘బంగార్రాజు’

నాగార్జున(Nagarjuna) కథానాయకుడి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్‌ చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’. 2016లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’(bangarraju) తెరకెక్కుతోంది. ఇందులో యువ కథానాయకుడు అక్కినేని నట వారసుడు నాగచైతన్య(Naga Chaitanya) కీలక పాత్ర పోషిస్తున్నాడు. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగచైతన్య సరసన కృతిశెట్టి సందడి చేయనుంది. ‘మనం’లో చిత్రంలోనూ నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ‘బంగార్రాజు’ ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.


 

అబ్బాయ్‌.. పెదనాన్నల ‘రాధేశ్యామ్‌’

ప్రభాస్‌(Prabhas) కథానాయకుడిగా తెరకెక్కుతున్న పీరియాడిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘రాధేశ్యామ్‌’(Radhe syam). పూజా హెగ్డే కథానాయిక. రాధాకృష్ణకుమార్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు(krishnam Raju) ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇద్దరికీ ఇది ముచ్చటగా మూడో సినిమా. ప్రభాస్‌ ఇందులో హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనుండగా, కృష్ణంరాజు అతీంద్రియ శక్తులున్న రుషి పరమహంసగా నటిస్తున్నారు.


తండ్రీ కొడుకుల మహాన్‌

విలక్షణ నటుడు విక్రమ్‌(Vikram) తెలుగువాళ్లకీ దగ్గరైన నటుడే. ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌తో తెరంగేట్రం చేశాడు ఆయన తనయుడు ధ్రువ్‌(Dhruv). ఇప్పుడు ఈ కుర్రాడు మూడో సినిమాతోనే తండ్రితో కలిసి నటించబోతున్నాడు. ‘మహాన్‌’(Maahan) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ సగానికి పైగా పూర్తయింది. గ్యాంగ్‌స్టర్స్‌ మధ్య సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ రివేంజ్‌ స్టోరీ ఇది. మెయిన్‌ హీరో విక్రమే అయినా ఉన్న కాసేపు మెరుపులు మెరిపించేలా ధ్రువ్‌ పాత్రను మలిచాడట దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌. సంతోష్‌ నారాయణ్‌ తనదైన శైలిలో సంగీతం అందిస్తున్నారు. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని