Pushpa: అల్లు అర్జున్‌ ‘పుష్ప’.. ఈ ఆసక్తికర విశేషాలు తెలుసా?

ఒక కొత్త దర్శకుడు, అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోతో కలిసి సినిమా చేస్తున్నారంటే, దానిపై పెద్దగా అంచనాలు ఉండవు.

Updated : 17 Dec 2021 12:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక కొత్త దర్శకుడు, అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోతో కలిసి సినిమా చేస్తున్నారంటే, దానిపై పెద్దగా అంచనాలు ఉండవు. ఆ సినిమా హిట్‌ అయి, వారిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే, ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి పెరుగుతుంది. మరి ఆ ఇద్దరు స్టార్‌లు... అది కూడా 12 ఏళ్ల తర్వాత కలిసి సినిమా చేస్తున్నారంటే, ఆ సినిమాపై భారీ అంచనాలే ఉంటాయి. వారే అల్లు అర్జున్‌ - సుకుమార్‌. అదే ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్‌ ‘పుష్ప - ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత వస్తున్న ‘పుష్ప’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

🪓 అల్లు అర్జున్‌ సుకుమార్‌ తొలిసారి 2004లో ‘ఆర్య’తో మంచి హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత 2009లో ‘ఆర్య 2’తో అలరించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి చేస్తున్న చిత్రం ‘పుష్ప’.

🪓 అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా ఇది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు.

🪓 ఈ సినిమాలో ‘పుష్ప’రాజ్‌ పాత్ర కోసం అల్లు అర్జున్‌ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. చిత్తూరు యాస నేర్చుకున్నారు.

🪓 ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో  ‘పుష్ప’అత్యధిక భాగం అడవుల్లో చిత్రీకరించారు. అందుకోసం చిత్ర బృందం మారేడుమిల్లి అడవులను ఎంచుకుంది. 

🪓 యూనిట్‌ మొత్తాన్ని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లడానికి రోజూ దాదాపు 300 వాహనాలను ఉపయోగించేవారు.

🪓 తొలి రోజు చిత్రీకరణే 1500 మంది నేపథ్యంలో సాగింది. ఎర్రచందనం కృత్రిమ దుంగలు ఒకొక్కసారి వేల సంఖ్యలో అవసరమయ్యేవి. ఫోమ్‌, ఫైబర్‌ కలిపి కృత్రిమ దుంగల్ని తయారు చేశారు.

🪓 ఎర్రచందనం దుంగల కోసం చిన్న ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌. దాన్ని లీడ్‌ చేసింది ప్రొడక్షన్‌ డిజైనర్లు మోనిక, రామకృష్ణ.

🪓 ఎర్రచందనం దుంగలు, యూనిట్‌ సామాగ్రిని అడవుల్లోకి తీసుకెళ్లడానికి కష్టమయ్యేది. ఇందుకోసం అడవుల్లో కొన్ని చోట్ల మట్టి రోడ్లు కూడా వేయాల్సి వచ్చింది.

🪓 కొన్ని రోజులు కేరళ అడవుల్లో చిత్రీకరణ జరిగింది. కృత్రిమ దుంగల్ని చిత్రీకరణ కోసం అక్కడకు తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు అక్కడి పోలీసులు పట్టుకున్నారట. ఇది ఎర్రచందనం కాదన్నా, తాము సినిమా వాళ్లమని చెప్పినా వాళ్లు వినలేదట. అవి సినిమా కోసం తయారు చేసినవని నిరూపించాక గానీ వదిలిపెట్టలేదట.

🪓 అల్లు అర్జున్‌ ‘పుష్ప’ గెటప్‌లో రెడీ అయ్యేందుకు మేకప్‌ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదట. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి.. ఐదుకల్లా సెట్‌కెళ్లి.. 5 నుంచి 7 వరకూ మేకప్‌ కోసమే ఓపిగ్గా కూర్చొనేవారట. షూట్‌ పూర్తయ్యాక మేకప్ తీయడానికి మరో 20 నుంచి 40 నిమిషాలు పట్టేదని బన్నీ చెప్పారు.

🪓 ‘పుష్ప’ కోసం అడవుల్లో రోజూ 500 మందికి పైగా పనిచేవారట. ఇక ఈ సినిమాలో ఓ పాటను దాదాపు 1000మందితో చిత్రీకరించారు.

🪓  ఈ సినిమా కోసం పనిచేసిన సినిమాటోగ్రాఫర్‌ మిరోస్లా కూబా బ్రోజెక్‌ పోలెండ్‌కు చెందిన వ్యక్తి. పోలాండ్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని ఇక్కడ పనిచేస్తున్నారు.

🪓 సునీల్‌ ఇందులో మంగళం శ్రీను అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. విలన్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్‌ కమెడియన్‌గా పేరు తెచ్చుకోవటం గమనార్హం.

🪓 ఈ సినిమాతో మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌, కన్నడ నటుడు ధనుంజయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు.

🪓 ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర మొదటి విజయ్‌ సేతుపతిని అడిగారు. కానీ డేట్స్‌ కుదరక ఆయన చేయలేకపోయారు.

🪓 ‘పుష్ప’ కోసం ఇద్దరు ఎడిటర్లు పనిచేస్తున్నారు. కార్తీక్‌ శ్రీనివాససన్‌‌, రుబెన్‌. సౌండ్‌ డిజైనర్‌గా అకాడమీ అవార్డు విన్నర్‌ రసూల్‌ పుకుట్టి చేస్తున్నారు. ‘అరణ్య’ తర్వాత తెలుగులో ఆయనకు రెండో చిత్రమిది.

🪓 సుకుమార్‌- దేవిశ్రీ ప్రసాద్‌ కలిసి వరుసగా చేస్తున్న ఎనిమిదో చిత్రం ‘పుష్ప’. ఇప్పటివరకూ విడుదలైన సాంగ్స్‌ అన్నీ కలిసి మొత్తంగా 250 మిలియన్‌ వ్యూస్‌కు పైగా సాధించాయి.

🪓 ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు పెట్టారట.

🪓 మైత్రీ మూవీ మేకర్స్‌తో రష్మికకు ఇది రెండో చిత్రం మొదటి చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌ చేశారు.’ అలాగే దర్శకుడు సుకుమార్‌కు మైత్రీ వారితో ఇది రెండో చిత్రమే మొదటిది ‘రంగస్థలం’.

🪓 ‘పుష్ప’ను మొదట ఒక చిత్రంగా తీయాలనుకున్నారు. కానీ, కథ పెద్దది కావడంతో రెండు భాగాలు చేశారు. ‘పుష్ప: ది రైజ్’ ఇప్పుడు విడుదలవుతోంది. ఈ సినిమా రన్‌ టైమ్‌ 2 గంటలా 59 నిమిషాలు.

🪓 హిందీలో 1000కు పైగా స్క్రీన్‌పై ‘పుష్ప’ను ప్రదర్శించనున్నారు.

🪓 ఈ సినిమాలో సమంత ‘ఉ అంటావా... ఊఊ అంటావా’ అనే ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఆమె కెరీర్‌లో తొలిసారి ఇలా కనిపిస్తోంది.

🪓 సమంత ఐటెమ్‌ సాంగ్‌ కోసం పెద్ద మొత్తంలోనే పారితోషికం అందుకుందని టాక్‌.  పాట కోసం ఆమెకు కోటిన్నర రూపాయలు ఇచ్చారట. మొత్తంగా ఈ పాటకు చిత్రబృందం రూ. ఐదు కోట్లు బడ్జెట్‌ పెట్టిందని టాక్‌.

🪓 ఈ సినిమాలో పాటలకు చాలామంచి పేరు వస్తోంది. అన్నింటినీ చంద్రబోసే రాశారు. 

🪓 ‘ఉ అంటావా... ఊ  ఊ అంటావా..’  పాటను ఆలపించిన ఇంద్రావతి చౌహాన్‌... ప్రముఖ సింగర్‌ మంగ్లీ చెల్లెలు. 

🪓 తొలి పార్ట్‌లో రష్మిక పాత్ర నిడివి తక్కువగానే ఉంటుంది. ఆమె రెండో పార్టులో విశ్వరూపం చూపిస్తుందట. ఫహద్‌ ఫాజిల్‌ కూడా సినిమా ఆఖరులోనే వస్తారని టాక్‌.

🪓 ఆఖరిగా... సినిమాకు ₹160 కోట్ల నుంచి ₹180 కోట్లు ఖర్చు చేశారని భోగట్టా. రెండో పార్టు చిత్రీకరణను ఫిబ్రవరిలో ప్రారంభిస్తారట.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని