Katrina Kaif: కత్రినా-విక్కీ పెళ్లి.. బీటౌన్‌ చూపు సిక్స్‌ సెన్సెస్‌ వైపు..!

బాలీవుడ్‌ లవ్లీకపుల్‌ కత్రినాకైఫ్‌-విక్కీ కౌశల్‌ మరి కొన్ని గంటల్లో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.

Published : 08 Dec 2021 16:33 IST

ముంబయి: బాలీవుడ్‌ లవ్లీకపుల్‌ కత్రినాకైఫ్‌- విక్కీ కౌశల్‌ మరి కొన్ని గంటల్లో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని సిక్స్‌సెన్సెస్‌ ఫోర్ట్‌లో వీరి వివాహం ఎంతో వైభవంగా జరగనుంది. దీంతో బీటౌన్‌ చూపు రాజస్థాన్‌వైపు నిలిచింది.

తరలివెళ్తోన్న తారాలోకం..!

కత్రినా- విక్కీ పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు బాలీవుడ్‌ సెలబ్రిటీలంతా రాజస్థాన్‌కు పయనమవుతున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌ల వద్ద కెమెరాల కంటపడుతున్నారు. దర్శకుడు కబీర్‌ఖాన్‌, నేహాదూపియా, అంగడ్‌బేడీ, కరణ్‌ జోహార్‌, ఫర్హాన్‌ ఖాన్‌ ఇప్పటికే వివాహ వేదిక వద్దకు చేరుకోగా.. ఆలియాభట్‌, రోహిత్‌ శెట్టి, వరుణ్‌ ధావన్‌, అనురాగ్‌ కశ్యప్‌ త్వరలోనే వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

పూర్తైన మెహందీ..

కత్రినా-విక్కీ కౌశల్‌ల మెహందీ వేడుక పూర్తైంది. బుధవారం ఉదయం జరిగిన ఈ వేడుకలో ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్‌ వీణా పాల్గొని.. వధూవరులకు గోరింటాకు పెట్టారు. పెళ్లికి విచ్చేసిన అతిథులూ ఈ మెహందీ వేడుకలో పాల్గొన్నారు. మరోవైపు కత్రినాకు వీణాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కత్రినా కుటుంబ వేడుకల్లో వీణా పాల్గొని.. ఆమెకు చేతికి మెహందీని అలంకరించారు. ఈ  ఫొటోలు సైతం తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

సంగీత్‌ కోసం ప్రత్యేకంగా..

బుధవారం సాయంత్రం వీరి సంగీత్‌ జరగనుంది. కత్రినాని తమ కుటుంబంలోకి స్వాగతిస్తూ.. పంజాబీ సంస్కృతికి అద్దంపట్టేలా మ్యూజికల్‌ కాన్సర్ట్‌కు విక్కీ కుటుంబం ప్లాన్‌ చేసిందట. కత్రినాపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ విక్కీ.. బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ సాంగ్‌ ‘తేరీ ఓరే’ని అందరి సమక్షంలో ఆలపించనున్నారట. మరోవైపు, కత్రినా సైతం గత కొన్నిరోజుల నుంచి పంజాబీ నేర్చుకుంటున్నారట.

రండి రండి.. దయచేయండి.. ఫోన్‌ తీసుకురావొద్దండి..!

పెళ్లికి వచ్చే అతిథులు ఫోన్లకు దూరంగా ఉండాలని ఇటీవల కత్రినా జంట ఆహ్వానపత్రికలు అందించే సమయంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా అతిథులకు బస ఏర్పాటు చేసిన ప్రాంతంలో కొన్ని నోటీసులు ఏర్పాటు చేశారు. ‘‘వాతావరణాన్ని ఎంజాయ్‌ చేయండి.. మా పెళ్లి వేడుకల్లో రీఫ్రెష్‌ అవ్వండి.. దయచేసి పెళ్లి మండపానికి మాత్రం ఫోన్‌ తీసుకురాకండి’’ అని పెళ్లి బృందం పేర్కొంది.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని