Biggboss Season5: కెప్టెన్సీ పోటీ: అర్హత కోల్పోయిన జెస్సీ.. హౌస్‌లో ఆకలిరాజ్యం

అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న కార్యక్రమం ‘బిగ్‌బాస్‌’. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓవైపు కంటెస్టెంట్స్‌ల ఆకలి కేకలు.. మరోవైపు కెప్టెన్సీ పోటీదారుల....

Updated : 30 Sep 2021 08:52 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న కార్యక్రమం ‘బిగ్‌బాస్‌’. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓవైపు కంటెస్టెంట్ల ఆకలి కేకలు.. మరోవైపు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లు హోరాహోరీగా సాగాయి. కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన ‘నెగ్గాలంటే తగ్గాల్సిందే’ టాస్క్‌ బుధవారం కూడా కొనసాగింది. బరువు తగ్గడం కోసం ఆహారం తినకుండా ఇంటి సభ్యులందరూ మంచి డెడికేషన్‌తోనే పోటీలో తలపడ్డారు. కాగా, హౌస్‌ నియమాలను ఉల్లంఘించడం వల్ల జశ్వంత్‌ కెప్టెన్‌ పోటీదారుడిగా అర్హత కోల్పోయాడు. అంతేకాకుండా తాజా టాస్క్‌కు జెస్సీ.. సంచాలక పోస్ట్‌ని కూడా బిగ్‌బాస్‌ పీకేశారు. జెస్సీకి జోడీగా ఉన్న కాజల్‌ కూడా కెప్టెన్సీ పోటీ టాస్క్‌లో నిలబడే అర్హత కోల్పోయింది. అయితే, ప్రస్తుత టాస్క్‌లో సంచాలక పోస్ట్‌కు కాజల్‌ను ఎంచుకోవడం ఆమెకు ఊరటనిచ్చే విషయం. ఈ సందర్భంగా విశ్వ.. పవర్‌ రూమ్‌ యాక్సెస్‌ దక్కించుకున్నారు. పవర్‌రూమ్‌లోకి వెళ్లిన విశ్వ-రవి తమ పోటీదారులుగా ప్రియ-ప్రియాంకలను ఎంచుకోగా.. వీరికి దుంగలు నరికే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో రవి-విశ్వ, ప్రియ-ప్రియాంకలు గట్టిగానే తలపడ్డారు. అయితే అది ఫిజికల్‌ టాస్క్‌ కావడంతో చివరికి రవి-విశ్వల జోడీ గెలిచింది. విశ్వ నిన్న ఫుడ్‌ తిన్నాడని.. అందుకే ఆడగలిగాడని శ్వేతావర్మ, ప్రియాంక చెప్పుకున్నారు.

అన్నం విలువేంటో తనకు బాగా తెలిసొచ్చిందని రవి అనగా.. బయటకెళ్లిన తర్వాత ఎవడైనా ఆహారం పారేసినట్లు కనబడితే వాడ్ని మామూలుగా కొట్టనని లోబో అన్నాడు. ఆకలితో అలమటిస్తున్న ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ పావ్‌బాజీ పంపించాడు. అయితే, దాన్ని ఎవరూ తీసుకోలేదు. అనంతరం నటరాజ్‌, రవి, లోబో, విశ్వలు ‘ఆకలిరాజ్యం’ సినిమా స్కిట్‌ వేశారు.

పవర్‌ రూమ్‌కు వెళ్లే అవకాశం దొరికితే ఎవర్ని ఎంచుకోవాలనే అంశంపై సన్నీ-మానస్‌ల మధ్య చర్చ జరిగింది. మొదట ప్రియ-ప్రియాంకలను ఎంచుకోవాలనుకున్నా.. వాళ్లను అప్పటికే రవి-విశ్వ జోడీ తీసుకోవడంతో ఈసారి నటరాజ్‌-లోబోలను ఎంపిక చేసుకుందామని అనుకున్నారు. తమని తక్కువ అంచనా వేసి.. టాస్క్‌లో నటరాజ్‌-లోబో ఓడిపోయారని శ్రీరామ్‌-హమీదా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ చికెన్‌ లెగ్‌పీస్‌లు పంపించాడు. కెప్టెన్సీ అర్హత కోల్పోయిన జెస్సీ.. తిందామనుకునేలోపు ప్రియాంక వాటిని తన్నుకుపోయింది. అనుకున్నట్టే.. సన్నీ-మానస్‌లకు పవర్‌రూమ్‌కు వెళ్లే అవకాశం దక్కింది. ముందుగా అనుకున్న విధంగా నటరాజ్‌-లోబో జోడీలను వాళ్లు ఎంచుకున్నారు. ‘మునిగేదేది? తేలేదేది?’ అంటూ ఇచ్చిన టాస్క్‌లో సన్నీ-మానస్‌ జోడీ గెలిచింది. అనంతరం బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులందరికీ మటన్‌ బిర్యానీ పంపించాడు. సన్నీ-మానస్‌-నటరాజ్‌-రవి-కాజల్‌ తదితరులు ఆ బిర్యానీ జోలికి పోలేదు. ఆకలిని అధిగమించి.. బరువు తగ్గి కెప్టెన్సీ పోటీదారులుగా ఎవరు బరిలో నిలిచారు..? కొత్త కెప్టెన్‌ ఎవరయ్యారు? తదితర విషయాలు తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని