Tollywood: పవర్‌స్టార్‌ పెయిర్‌ ఫిక్స్‌.. కపుల్‌గా వచ్చిన నాగశౌర్య

సినీ పరిశ్రమలో శుక్రవారానికి ఎంతో ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్‌వేవ్‌ అనంతరం ఇప్పుడు మరలా పరిశ్రమలో ఫ్రైడే ఫెస్టివల్‌ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఓ వైపు ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌ నాట్‌ ఏ లవ్‌ స్టోరీ’ థియేటర్ల వేదికగా...

Published : 30 Jul 2021 15:04 IST

శుక్రవారం సందడి షురూ

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలో శుక్రవారానికి ఎంతో ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్‌వేవ్‌ అనంతరం ఇప్పుడు మళ్లీ పరిశ్రమలో ఫ్రైడే ఫెస్టివల్‌ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఓ వైపు ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌: నాట్‌ ఏ లవ్‌ స్టోరీ’ థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకు రాగా, మరోవైపు కొత్త సినిమా అప్‌డేట్‌లు సినీ ప్రియులకు రెట్టింపు ఉత్సాహాన్ని అందించాయి. అలా ఈరోజు బయటకు వచ్చిన తెలుగు సినీ అప్‌డేట్‌లపై ఓ లుక్కేయండి..!

భీమ్లానాయక్‌ పెయిర్‌ ఫిక్స్‌..!

మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా తెలుగులో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. ఇందులో పవన్‌ సతీమణి పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంలో ఎన్నో రోజుల నుంచి చర్చ సాగింది. ఎంతోమంది హీరోయిన్స్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. శుక్రవారం ఆ సందేహాలన్నింటికీ తెరదించుతూ హీరోయిన్‌ పేరు అధికారికంగా ప్రకటించారు. నిత్యామేనన్‌ ఇందులో నటిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు రానాకు జోడీగా నటి ఐశ్వర్యా రాజేశ్‌ సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


జంటగా వచ్చిన నాగశౌర్య..!

నాగశౌర్య ప్రధాన పాత్రలో ‘లక్ష్య’ పేరుతో ఓ స్పోర్ట్స్‌ డ్రామా సిద్ధమవుతోంది. ఆర్చరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి కేవలం హీరో పోస్టర్లు, గ్లిమ్స్‌ మాత్రమే బయటకు వచ్చాయి. కాగా, తాజాగా హీరోయిన్‌ కేతికా శర్మ-శౌర్య జంటగా ఉన్న ఓ పోస్టర్‌ని చిత్రబృందం నెట్టింట్లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆన్‌ డ్యూటీ..!

రవితేజ కథానాయకుడిగా వాస్తవిక సంఘటనలు ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకుడు. ఇందులో రవితేజ నిజాయితీ కలిగిన ప్రభుత్వాధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ స్వరాలు అందించనున్నారని చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కోలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు ఆయన సంగీతం అందించి గుర్తింపు తెచ్చుకున్నారు.


శ్రీదేవిని చూపించేశారు..!

సుధీర్‌బాబు-ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రానికి కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్‌ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ వీడియో షేర్‌ చేసింది. ఆనంది నటన, గ్రామీణ యాసలో ఆమె చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని