MAA Elections: బాలయ్యను కలిశా... చిరంజీవినీ కలుస్తా: మంచు విష్ణు

సినీ పెద్దలందరితో కలిసి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ అభివృద్ధి కోసం పాటుపడతానని నటుడు, నూతన ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తనకు మద్దతుగా...

Updated : 14 Oct 2021 14:13 IST

హైదరాబాద్‌: సినీ పెద్దలందరితో కలిసి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ అభివృద్ధి కోసం పాటుపడతానని నటుడు, ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తనకు మద్దతుగా నిలిచిన నందమూరి బాలకృష్ణను తొలిసారి కలిశారు. తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి గురువారం ఉదయం బాలయ్య ఇంటికి వెళ్లారు. ‘మా’ అభివృద్ధి, శాశ్వత భవన నిర్మాణం వంటి అంశాలపై బాలకృష్ణతో చర్చించారు. భేటీ అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడారు. తాను త్వరలోనే మెగాస్టార్‌ చిరంజీవిని కలవనున్నట్లు చెప్పారు.

‘ఈ నెల 16న ‘మా’ అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేయనున్నాను. ఆ కార్యక్రమానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందర్నీ ఆహ్వానిస్తున్నాను. ఇందులో భాగంగా ఇప్పటికే కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, పరుచూరి సోదరులను కలిశాను. త్వరలోనే చిరంజీవిని కలుస్తాను. ప్రకాశ్‌రాజ్‌ను కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి పిలుస్తా. ఈ ఎన్నికల్లో బాలయ్య నాకు మొదటి నుంచి ఎంతో సపోర్ట్‌ చేశారు. ఆశీర్వాదం తీసుకోవడానికే ఈరోజు ఆయన ఇంటికి వచ్చాను. పెద్దలందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తాను’ అని వివరించారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ రాజీనామాలపై ఈసీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటానని విష్ణు తెలిపారు. ఎన్నికల అనంతరం ‘మా’లో నెలకొని ఉన్న పరిస్థితుల రీత్యా బాలయ్యతో భేటీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని