Raj Tarun: బెట్టింగ్‌ జోలికి వెళ్లను: రాజ్‌ తరుణ్‌

ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన.. మొదటి ప్రయత్నంలోనే సూపర్‌ హిట్‌...

Updated : 24 Nov 2021 20:37 IST

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన.. మొదటి ప్రయత్నంలోనే సూపర్‌ హిట్‌ అందుకున్న యువ నటుడు రాజ్‌ తరుణ్‌. కెరీర్‌లో ఎత్తుపల్లాలు చవిచూస్తోన్న ఆయన ఇప్పుడు మరోసారి అదే బ్యానర్‌పై హిట్‌ అందుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అనుభవించు రాజా’. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుప్రియ నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో రాజ్‌ తరుణ్‌ తాజాగా విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలివే..!

నా సినిమాలు ఎక్కువగా అక్కడే జరిగాయి..: 

‘‘సినిమా కథ విన్నప్పుడు నాకెంతో నచ్చింది. సినిమా చేయాలని అనుకున్నాను. ఫైనల్‌ అవుట్‌పుట్‌ కూడా చూశాను. సినిమా నాకు బాగా నచ్చింది. చాలారోజుల గ్యాప్‌ తర్వాత ఇలాంటి సరదా క్యారెక్టర్‌ చేస్తున్నాను. సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం భీమవరంలోనే జరిగింది. నిజం చెప్పాలంటే నా  సినిమాల షూటింగ్స్‌ ఆ ప్రాంతంలోనే జరిగాయి. దాంతో ఆ ప్రాంతంతో నాకు మంచి అనుబంధం ఉంది. అక్కడ ప్రజలు నాకు బాగా పరిచయమయ్యారు’’

రియల్‌లైఫ్‌తో సంబంధం లేదు..:

‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు బంగారం. సరదాలకు అలవాటు పడిన వ్యక్తి. కోడి పందేలు వేస్తుంటాడు. డబ్బులు దుబారా చేస్తుంటాడు. నిజం చెప్పాలంటే రియల్‌ లైఫ్‌లో నాకు బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సంక్రాంతి టైమ్‌లో ఊర్లో కోడిపందేలు చూసేవాడిని అంతే. సినిమాలోని పాత్రకు నా రియల్‌లైఫ్‌కి ఎలాంటి సంబంధం ఉండదు’’

సెక్యూరిటీ గార్డ్‌ అంత ఈజీ కాదు..:

‘‘ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నేను సెక్యూరిటీ గార్డ్‌గా కనిపిస్తాను. సాధారణంగా మనం సెక్యూరిటీ గార్డ్‌ అంటే చులకనగా చూస్తుంటాం. కానీ సెక్యూరిటీ గార్డ్‌ కావడం కూడా అంత సులభం కాదు. వాళ్లక్కూడా ఫిజికల్‌ టెస్టుతో పాటు శిక్షణ ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేయడం కూడా అంత సులభమైన విషయం కాదని సినిమా షూట్‌లో అర్థమైంది.’’

కథ ఎప్పుడో విన్నా.. కానీ:

‘‘శ్రీను గవిరెడ్డితో నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. గడిచిన తొమ్మిదేళ్ల నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. వారంలో రెండు సార్లైనా మేమిద్దరం తప్పకుండా కలుస్తాం. సరదాగా మాట్లాడుకుంటాం. మా ఇద్దరి కాంబోలో వచ్చిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ ఫ్లాప్‌ అయ్యింది. ‘అనుభవించు రాజా’ కథ గురించి తను నాతో ఎన్నో సార్లు చెప్పాడు. స్క్రిప్ట్‌ డెవలప్‌మెంట్‌లో ఉన్నప్పుడే నాకు ఈ కథ తెలుసు. కానీ ఈ సినిమాలో ఎవరు చేస్తారో తెలీదు. అలాంటి టైమ్‌లో శ్రీను ఓసారి అన్నపూర్ణ స్టూడియోస్‌కి వెళ్లి.. కథ చెప్పగా.. నాగార్జున, సుప్రియలకు బాగా నచ్చింది. వెంటనే వాళ్లు నేనైతే ఈ కథకు సెట్‌ అవుతానని భావించి నన్నూ ఇందులో భాగం చేశారు’’

ఒకరిపై నిందలు వేయకూడదు..:

‘‘సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు’ ఫ్లాప్‌ అయ్యాక.. శ్రీనుతో చేస్తున్న సినిమా ఇదే కావడంతో అందరూ ఈ ప్రాజెక్ట్‌ గురించే మాట్లాడుతున్నారు. ‘శ్రీనుతో ఓ ఫ్లాప్‌ చూశారు కదా.. ఈ సినిమా చేసేటప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకుని భయపడ్డారా’? అని అందరూ అంటున్నారు. నిజం చెప్పాలంటే శ్రీను ఎలాంటి వ్యక్తో నాకు బాగా తెలుసు. అయినా ఒక సినిమా పరాజయానికి ఎన్నో కారణాలుంటాయి. ఒక వ్యక్తిపైనే నిందలు వేయడం సరైన పద్ధతి కాదు అనేది నా ఉద్దేశం’’

నా అదృష్టం..: 

‘‘అన్నపూర్ణ స్టూడియోస్‌తోనే నేను హీరోగా పరిచయమయ్యాను. ఇప్పుడు అదే బ్యానర్‌పై మూడో సినిమా చేస్తున్నాను. అంత పెద్ద బ్యానర్‌లో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం’’

ఫ్రెండ్స్‌ అయిపోయాం..:

‘‘హీరోయిన్‌ కశిక్‌ఖాన్‌ మంచి అమ్మాయి. ఎంతో కష్టపడి ఈ సినిమా చేసింది. తనకు తెలుగు సరిగ్గా రాదు. అయినప్పటికీ నేర్చుకుని మరీ, డైలాగ్‌లు చెప్పింది. మేమిద్దరం మంచి స్నేహితులం అయిపోయాం. అజయ్‌ అన్న కూడా ఇందులో మంచి పాత్ర పోషించారు. సెట్‌లో మేమంతా ఎంతో సరదాగా షూట్‌ చేశాం.’’

నాగచైతన్య సినిమా చూశారు కదా..:

‘‘ఇటీవల నాగచైతన్య ‘అనుభవించు రాజా’ సినిమా చూశారు. ఆయనకు మా సినిమా బాగా నచ్చింది. సినిమా పూర్తయ్యాక.. శ్రీనుతో అరగంట సేపు మాట్లాడారు. సినిమా బాగుందని చెప్పారు’’

ఇదే కరెక్ట్‌ టైమ్‌..:

‘‘మా చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలనే దానిలో మేము ఎప్పుడూ ఆలోచన చేయలేదు. సంక్రాంతికి పెద్ద సినిమాలుంటాయి కాబట్టి ఆ సమయంలో వద్దనుకున్నాం. అలాంటి టైమ్‌లో నవంబర్‌లోనే విడుదల చేస్తే బాగుంటుందని భావించి నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని