RRR: మా బంధం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ముగిసిపోదు: జూనియర్‌ ఎన్టీఆర్‌

యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల సమయం దగ్గర పడుతోంది.

Published : 30 Dec 2021 01:33 IST

తిరువనంతపురం: యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అన్ని భాషల్లోనూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఇటీవల చెన్నై ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన టీమ్‌ బుధవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో వేడుకను నిర్వహించింది. మలయాళ నటుడు టొవినో థామస్‌ (మిన్నల్‌ మురళి ఫేం) ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజమౌళి, రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్ మాట్లాడారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత దానయ్యగారికి ధన్యవాదాలు. నాతో ఓ సినిమా చేసేందుకు ఆయన చాలా సంవత్సరాలు ఎదురుచూశారు. తన చిత్రాలు దేశవ్యాప్తంగా విడుదలవుతుంటే దర్శకుడికి అంతకుమించిన ఆనందం ఏముంటుంది. నా సినిమాల్ని అన్ని భాషలవారు ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ‘ధీర’, ‘ఈచ’, ‘బాహుబలి’ చిత్రాలకు కేరళలో విశేష స్పందన లభించింది. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అదే స్థాయిలో అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. కేరళ ప్రాంతంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడ సుమారు 25  రోజులు ‘సింహాద్రి’ సినిమా చిత్రీకరించాం’’ అని నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. వేడుకకు విచ్చేసిన టొవినో థామస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ‘‘నా ‘ధీర’ (మగధీర) సినిమాను మీరెంతగానో ఆదరించారు. కానీ, మీ ప్రేమకు కానుకగా ఎలాంటి వేడుకల్ని నిర్వహించలేకపోయాం. ‘చరణ్‌ కేరళ ప్రజలు నీపై ఎంతో ప్రేమ కురిస్తున్నారు. నవ్వు తప్పకుండా అక్కడికి వెళ్లాలి’ అని రాజమౌళి చెప్తుండేవారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అది ఇప్పుడు కుదిరింది. కేరళ ఎంతో అందమైన ప్రదేశం. ఇక్కడి ఆహారం నాకెంతో ఇష్టం. మలయాళ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన టెక్నిషియన్స్‌ ఉన్నారు. మేం.. మీ దర్శకులు, నటులను ఇష్టపడతాం. మీ సినిమాల నుంచి మేం స్ఫూర్తిపొందుతాం. ఎన్టీఆర్‌ నాలో సగభాగం. తను లేనిదే ఈ చిత్రం లేదు’’ అని అన్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ..‘‘చలన చిత్ర పరిశ్రమకు తమిళనాడు (తమిళ చిత్ర పరిశ్రమ) షెల్టర్‌ ఇస్తే టెక్నాలజీ విషయంలో కేరళ (మలయాళ చిత్ర పరిశ్రమ) జన్మనిచ్చింది. కేరళ చిత్ర పరిశ్రమకు ఎంతోమంది గ్రేట్‌ టెక్నీషియన్లను అందించింది. రాజమౌళి చెప్పినట్టుగా ‘సింహాద్రి’ కొంతభాగం షూటింగ్‌ ఇక్కడే జరిగింది. మళ్లీ ఇన్నేళ్లకు ఇక్కడికి రావటం ఆనందంగా ఉంది. అతిథిగా విచ్చేసిన నా బ్రదర్‌ టొవినో థామస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వల్ల నేనూ చరణ్‌ స్నేహితులం కాలేదు. అంతకు ముందే మేం ఫ్రెండ్స్‌. మా స్నేహం వల్లే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాధ్యమైంది. 200 రోజులు నా సోదరుడి (చరణ్‌)తో గడిపే అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్స్‌ చెబుతున్నా. మా బంధం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ముగిసిపోతుందని నేను అనుకోవట్లేదు. మేమెప్పుడూ ఇలానే ఉండాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని