Samantha: ఆ విషయాలపై ఎప్పుడూ నన్ను నేను ప్రశ్నించుకుంటా: సమంత

నటుడు నాగచైతన్య నుంచి విడిపోయిన అనంతరం కథానాయిక సమంత తన ఫోకస్‌ మొత్తం కెరీర్‌పైనే పెట్టారు. వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలను.....

Updated : 22 Nov 2021 11:29 IST

హైదరాబాద్‌: నాగచైతన్య నుంచి విడిపోయిన అనంతరం కథానాయిక సమంత తన ఫోకస్‌ మొత్తం కెరీర్‌పైనే పెట్టారు. వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలను మర్చిపోవడం కోసం వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ.. ఒకదాని తర్వాత మరొకటి పట్టాలెక్కించేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సామ్‌ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను నిర్మాణ సంస్థలో సమంత ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

తన బాలీవుడ్‌ ఎంట్రీపై వస్తోన్న వార్తలపై తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘మంచి స్క్రిప్ట్‌ వస్తే తప్పకుండా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తాను. నాకు కూడా అక్కడ సినిమాలు చేయాలని ఆసక్తి ఉంది. నిజం చెప్పాలంటే ప్రాజెక్ట్‌ ఓకే చేయడంలో భాష అనేది సమస్య కానే కాదు. కథలో జీవం ఉందా లేదా? ఆ కథకు నేను సెట్‌ అవుతానా? పాత్రకు న్యాయం చేయగలనా?.. ఏదైనా ప్రాజెక్ట్‌ ఓకే చేసే ముందు ఇలా నన్ను నేను ప్రశ్నించుకుంటాను’’ అని సమంత సమాధానమిచ్చారు. బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ సిరీస్‌తో సామ్‌ బాలీవుడ్‌ సినీ ప్రియులకు సుపరిచితురాలు అయ్యారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో సామ్‌ రాజీ అనే నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని