Silambarasan: గుర్తు పట్టలేనంతగా మారిన శింబు!

ప్రముఖ తమిళ నటుడు శింబు ఓ పాత్ర కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎప్పుడూ రొమాంటిక్‌  స్టైలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చే ఆయన తొలిసారి డీ గ్లామర్‌ పాత్రలో కనిపించి అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు.

Published : 06 Aug 2021 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ తమిళ నటుడు శింబు ఓ పాత్ర కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎప్పుడూ రొమాంటిక్‌, స్టైలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చే ఆయన తొలిసారి డీ గ్లామర్‌ పాత్రలో కనిపించి అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. తదుపరి చిత్రం ‘వెందు తనిందదు కాడు’ కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్‌ మేనన్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. వెల్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై డాక్టర్‌ ఇషారీ కె. గణేశ్‌ నిర్మిస్తున్నారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో లుంగీ ధరించి, కర్రపట్టుకుని అమాయకంగా కనిపించాడు శింబు. అతని వెనక ప్రాంతంలో మంటలు చెలరేగుతుంటాయి. ‘వెందు తనిందదు కాడు’ అంటే కాలి బూడిదైన అడవి అని అర్థం. దీన్ని బట్టి చూస్తుంటే అడవి నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతుంది. గౌతమ్‌- శింబు కాంబినేషన్‌లో గతంలో తెరకెక్కిన క్లాసికల్‌ ప్రేమకథ ‘విన్నైతాండి వరువాయా’ (ఏమాయ చేశావే) సూపర్‌ హిట్‌గా నిలిచింది. దాంతో ఇప్పుడు తమ కొత్త చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. నాయిక, చిత్రీకరణ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ‘వల్లభ’, ‘మన్మథ’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు శింబు. కొన్ని తెలుగు పాటలతో గాయకుడిగానూ అలరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని