RRR: ‘దోస్తీ’ సాంగ్‌.. అనిరుధ్‌, అమిత్‌ ఏమన్నారంటే

రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ సింగర్స్‌ అనిరుధ్‌, అమిత్‌ త్రివేది అన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 1వ తేదీన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’....

Published : 30 Jul 2021 13:32 IST

హైదరాబాద్‌: రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ సింగర్స్‌ అనిరుధ్‌, అమిత్‌ త్రివేది అన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 1వ తేదీన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘దోస్తీ’ ప్రమోషనల్‌ సాంగ్‌ విడుదల కానుంది. ఈ ప్రమోషనల్‌ పాట కోసం ఐదు భాషలకు చెందిన ప్రముఖ గాయకులు హేమచంద్ర (తెలుగు), అనిరుధ్‌ (తమిళం), అమిత్‌ త్రివేది (హిందీ), విజయ్‌ ఏసుదాస్‌ (మలయాళం), యాజిన్‌ నైజర్‌ (కన్నడ)లను ఒకే తాటి మీదకు తీసుకువచ్చారు కీరవాణి. మరికొన్ని రోజుల్లో ‘దోస్తీ’ పాట సినీ ప్రియుల ముందుకు రానున్న నేపథ్యంలో అనిరుధ్‌, అమిత్‌.. కీరవాణితో కలిసి పనిచేయడం గురించి స్పందించారు.

‘చిన్నతనం నుంచి నాకు కీరవాణి సర్‌ అంటే ఎంతో అభిమానం. ఆయన పాటలంటే నాకెంతో ఇష్టం. ఆయన పాటలు ఎప్పుడు విన్నా సరే కొత్తగానే ఉంటాయి.  రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం మొదటిసారి ఆయన కంపోజిషన్‌లో పనిచేసే అవకాశం నాకు లభించింది. ఐదు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు గాయకులం కలిసి లైవ్‌లో ఆ పాటను పాడి షూట్‌ చేశాం. ఇది ఒక అద్భుతమైన అనుభవం. రాజమౌళి, కీరవాణి, ఇతర చిత్రబృందానికి నా ధన్యవాదలు’ - అమిత్‌ త్రివేది

‘దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి సర్‌ మ్యూజిక్‌ కంపోజిషన్‌లో ప్రమోషనల్‌ సాంగ్‌లో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ స్నేహగీతం త్వరలో మీ అందరి ముందుకు రానుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శకధీరుడు రాజమౌళి, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మొత్తానికి నా ధన్యవాదాలు’ - అనిరుధ్‌ వివరించారు.

రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌- రౌద్రం రణం రుధిరం’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్‌ 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌ని చిత్రబృందం భారీగానే ప్లాన్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ‘దోస్తీ’ పేరుతో ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ను మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని