Sankranthi Movies: టాలీవుడ్‌లో ఈసారి రచ్చ రచ్చే..!

సంక్రాంతి పండుగంటే తెలుగువారికే కాదు సినీ పరిశ్రమకు కూడా ఇదొక పెద్ద పండుగే. ఏడాది ఆరంభంలో వచ్చే ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలో సినిమాల జాతర మామూలుగా ఉండదు. భారీ వసూళ్లు..

Published : 31 Jul 2021 01:08 IST

సంక్రాంతి రేస్‌లో ముగ్గురు స్టార్‌ హీరోలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సంక్రాంతి పండుగంటే తెలుగువారికే కాదు సినీ పరిశ్రమకు కూడా పెద్ద పండుగే. ఏడాది ఆరంభంలో వచ్చే ఈ పండుగను పురస్కరించుకుని థియేటర్లలో సినిమాల జాతర మామూలుగా ఉండదు. భారీ వసూళ్లు.. రికార్డ్స్‌ బ్రేక్‌.. ఇలాంటి సంబరాలకు సంక్రాంతి పండుగ పెట్టింది పేరు. ఎంతోమంది స్టార్‌ హీరోలు ఈ సంక్రాంతి రేసులో నిలబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. కాగా, వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటికే ముగ్గురు స్టార్‌హీరోలు బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. బిగ్‌ ఫెస్టివ్‌ రేసుకి సిద్ధమైనట్లు ప్రకటించారు. ఇంతకీ ఎవరా హీరోలు? ఏమా చిత్రాలు? మీరూ ఓ లుక్కేసేయండి..!

సూపర్‌స్టార్‌కు కొట్టిన పిండి

అగ్రకథానాయకుడు మహేశ్‌బాబుకు సంక్రాంతి రేస్‌ కొత్తేమీ కాదు. ఆయన నటించిన చాలా సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. 2002లో విడుదలైన ‘టక్కరిదొంగ’తో ఆయన మొదటిసారి పండుగ పోటీలో నిలబడ్డారు. అనంతరం ఆయన.. ‘ఒక్కడు’, ‘బిజినెస్‌ మేన్‌‌’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘1 నేనొక్కడినే’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో అలరించారు. కాగా, తాజాగా మహేశ్‌ మరోసారి సంక్రాంతి బరిలోకి పందెంకోడిలా దిగుతున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకురానున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. కీర్తిసురేశ్‌ కథానాయిక. ఇందులో మహేశ్‌ పొడవాటి జుట్టుతో, మెడపై రూపాయి టాటూతో విభిన్నంగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.


పవర్‌స్టార్ ముచ్చటగా మూడోసారి

సంక్రాంతి పోటీలో మరో అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ కూడా నిలిచారు. ఆయన కీలకపాత్రలో నటించిన ‘గోపాలగోపాల’ 2015లో సంక్రాంతి కానుకగా విడుదలై సత్ఫలితాలివ్వగా.. 2018లో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ మిశ్రమ స్పందనలందుకుంది. కాగా, ఇప్పుడు మళ్లీ ఆయన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌తో పండుగ పోటీలోకి అడుగుపెట్టారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌-రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిత్యామేనన్‌-ఐశ్వర్యా రాజేశ్‌ కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


పాన్‌ఇండియా స్టార్‌ ప్రేమకథ

‘బాహుబలి’, ‘సాహో’ వంటి భారీ యాక్షన్‌ అడ్వంచెర్స్‌ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. వింటేజ్‌ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ‘వర్షం’ (2004), ‘యోగి’ (2008) చిత్రాలతో ప్రభాస్‌ ఇప్పటికే సంక్రాంతి రేస్‌ అనుభవాలు చవి చూశారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని