Sridevi Drama Company: ‘అతడు’ స్పూఫ్‌తో ‘జబర్దస్త్‌’ కామెడీ.. గానంతో కట్టిపడేసిన ఇంద్రజ

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుధీర్‌ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమవుతుంది.

Published : 02 Nov 2021 14:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుధీర్‌ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమవుతుంది. పండగ రోజున, సినీ ప్రముఖుల పుట్టినరోజున ఈ షోలో ఎంటర్‌టైన్‌మెంట్‌ మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో పండగలు, ఎందరో సెలబ్రిటీల గురించి వివరించి, అలరించిన ఈ షో మరోసారి అంతే హుషారుగా సాగింది. నవంబరు 7న ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా రూపొందిన ప్రత్యేక ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజా విడుదలైంది. ఆ విశేషాలివీ..

త్రివిక్రమ్‌ తెరకెక్కించిన సినిమాల్లోని పాటలు, సన్నివేశాలతో ఆద్యంతం అలరించేలా సాగింది. మహేశ్‌ బాబు హీరోగా వచ్చిన ‘అతడు’ సినిమాలో నాజర్‌- తనికెళ్ల భరణి మధ్య సాగే సన్నివేశం ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే సీన్‌ని స్పూఫ్‌ చేసి ‘జబర్దస్త్‌’ నటులు ఆది, గెటప్‌ శ్రీను, సుధీర్‌, ప్రసాద్‌ విశేషంగా ఆకట్టుకున్నారు. సినిమాలోని ఈ సీరియస్‌ సన్నివేశాన్ని వీళ్లు సరదాగా రీ క్రియేట్‌ చేశారు. నటి ఇంద్రజ ఈ వేదికపై తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ‘కన్నులతో చూసేవి గురువా’ పాటని ఆలపించి అందరినీ కట్టిపడేశారు. మధ్యలో.. త్రివిక్రమ్‌ జీవిత ప్రస్థానాన్ని చూపించిన తీరు బాగుంది. వీడియో చివరిలో.. త్రివిక్రమ్‌ స్నేహితుడు, నటుడు పవన్‌ కల్యాణ్‌ డూప్‌ ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్రివిక్రమ్‌ గురించి వీరంతా ఇంకా ఏఏ సంగతులు చెప్పారు? తెలియాలంటే నవంబరు 7 వరకు ఆగాల్సిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు